అక్షరటుడే, వెబ్డెస్క్: IAS Gandham Chandrudu Story : ప్రభుత్వ కార్యాలయాల ముఖద్వారాలు సామాన్యుడి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాయో చెప్పడానికి చట్టాలు, నిబంధనల పుస్తకాలు అక్కర్లేదు.
ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు, సమాజంలో గౌరవంగా బతకడం కోసం విద్యను ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తే.. ఆ ఆశయంపై మొదటి అడుగులోనే అవినీతి అపహాస్యం చేసిన తీరు ఇది.
1992వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని ఒక చిన్న మండల కేంద్రంలో జరిగిన ఒక ఘటన.. కేవలం ఒక వ్యక్తిగత జ్ఞాపకం కాదు. అది దేశ పరిపాలనా వ్యవస్థలో నిట్టనిలువునా వేళ్లూనుకుపోయిన క్యాన్సర్ లాంటి అవినీతికి నిలువెత్తు సాక్ష్యం.
ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు 2021 జులైలో తన ఫేస్బుక్ వాల్పై రాసిన “నా Certificate కథ” కన్నీటి చారిత్రక దస్తావేజుగా నిలిచిపోయింది.

IAS Gandham Chandrudu Story | ముళ్ల కంప నీడన పడిగాపుల బాల్యం
కాల చక్రంలో ముప్పై ఏళ్లకు పైగా వెనక్కి వెళ్తే.. అది 1992వ సంవత్సరం. వేసవి తీవ్రత ఇంకా తగ్గని మధ్యాహ్న సమయం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయం వెలుపల ఒక హృదయవిదారక దృశ్యం ఆవిష్కృతమైంది.
ఎండ తీవ్రతకు భూమి నిప్పులు చెరుగుతోంది. కార్యాలయానికి సరిగ్గా పది మీటర్ల దూరంలో.. అక్కడ ఒక చిన్న ముళ్ల చెట్టు (ముళ్లకంప) ఉంది. ఆ ప్రాంతంలో దానికి విభిన్నమైన పేర్లు ఉండవచ్చు, కానీ అది ఇచ్చే నీడ మాత్రం చాలా అల్పం. ఆ కంపచెట్టు ఆకులు తెరిపెలు తెరిపెలుగా ఉంటూ ఎండను ఆపలేకపోతున్నాయి. అయినా, ఆ పరిసరాల్లో తలదాచుకోవడానికి అదొక్కటే ఆశ్రయం.
ఆ చెట్టు కింద ఉన్న ఒక చిన్న నాపరాతి అరుగులాంటి బండ మీద కూర్చుని ఉన్నాడు ఒక 11 ఏళ్ల బాలుడు. ఆ బాలుడి పేరే గంధం చంద్రుడు. కాళ్లకు చెప్పులు లేవు. అంగీ, నిక్కరు ధరించిన ఆ బాలుడి కళ్లలో ఒకే ఒక్క ఆశ. అక్కడి ఎమ్మార్వో కార్యాలయం లోపలి నుంచి ఎవరైనా తన పేరు పిలుస్తారేమోనని ఆ ఆఫీసు వైపు దీనంగా చూస్తున్నాడు.
ఉదయం పదకొండున్నర ప్రాంతంలో ఆ కార్యాలయానికి వచ్చిన ఆ బాలుడికి.. లోపల ఉన్న జూనియర్ అసిస్టెంట్ అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. “MRO వచ్చిన తర్వాత నీ పని చూస్తాం, వెళ్లి బయట వేచి ఉండు” అన్న ఆ ఒక్క మాట ఆ బాలుడిని ఆ కంపచెట్టు కింద పడిగాపులు కాసేలా చేసింది.

IAS Gandham Chandrudu Story : పెద్దాయన ఓదార్పు..
ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ బండ మీద కూర్చుంటూ ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏం నాయనా! ఈ నడికారు ఎండలో ఇక్కడ ఒక్కడివే కూర్చున్నావు? ఏం పని మీద వచ్చావు?” అని ఆప్యాయంగా అడిగాడు. ఆ బాలుడు తన గొంతులో వణుకును దాచుకుంటూ, “Caste Certificate (కుల ధృవీకరణ పత్రం) కోసం వచ్చాను పెద్దాయన” అని సమాధానమిచ్చాడు.
“దాదాపు నెల రోజుల క్రితమే దరఖాస్తు పెట్టుకున్నాను, ఈరోజు ఇస్తామని మా ఊరి తలారి (VRA) చెబితే వచ్చాను” అన్నాడు. “మరి నీతో పాటు పెద్దవాళ్లు ఎవరూ రాలేదా?” అని ఆ పెద్దాయన ప్రశ్నించగా.. ఆ బాలుడు చెప్పిన సమాధానం నాటి నిరుపేద కుటుంబాల ఆకలి కేకలను ప్రతిబింబించింది.
“మా అమ్మానాన్న కూలి పనికి వెళ్లారు పెద్దాయన. వాళ్లు పనికి వెళ్లకుంటే పూట గడవదు. అందుకే నన్ను ఒక్కడినే వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోమన్నారు” అని ఆ చిన్నారి బదులిచ్చాడు.

IAS Gandham Chandrudu Story | పది రూపాయల ప్రయాణం..
ఆ బాలుడి కళ్లలో చదువుకోవాలనే తపన ఉంది. ఐదో తరగతి పూర్తి కావస్తోంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన నవోదయ పాఠశాల ప్రవేశ పరీక్ష రాసి, సీటు సాధించాడు. ఆరో తరగతిలో చేరాలంటే అన్ని ధ్రువ పత్రాలు (Original Certificates) సమర్పించాలని పాఠశాల నుంచి లేఖ వచ్చింది.
ఆ సర్టిఫికెట్లు లేకపోతే సీటు రద్దవుతుంది, చదువు ఆగిపోతుంది. ఈ విషయాన్ని ఆ బాలుడు తన తండ్రికి చెప్పినప్పుడు, ఆ తండ్రి పడ్డ ఆరాటం అంతా ఇంతా కాదు. “నేను పనికి వెళ్లకపోతే ఇంట్లో గంజి ఉడకదు నాయనా, నువ్వు ఒక్కడివే వెళ్లి తీసుకురాగలవా?” అని తండ్రి అడిగితే, ఆ బాలుడు ధైర్యంగా ఒప్పుకొన్నాడు.
కోటపాడు గ్రామం నుంచి కొలిమిగుండ్లకు వెళ్లడానికి నాటి ఛార్జీల లెక్కలను ఆ బాలుడు నోటితో లెక్కగట్టాడు. పేరుసోముల నుంచి తిమ్మనాయుని పేటకు రూపాయిన్నర, అక్కడి నుంచి కొలిమిగుండ్లకు రెండు రూపాయలు.. రాను మూడున్నర, పోను మూడున్నర.. మొత్తం ఏడు రూపాయలు అవుతుంది.
ఆ పేద తండ్రి తన కష్టార్జితం నుంచి ఒక పది రూపాయల నోటును తీసి కొడుకు చేతిలో పెట్టాడు. “మిగతా మూడు రూపాయలతో మధ్యాహ్నం కొలిమిగుండ్లలో ఏదైనా తిను. డబ్బులు జాగ్రత్త, పోగొట్టుకుంటే అంతే సంగతులు” అని హెచ్చరించాడు.
ఆ పది రూపాయల నోటు ఆ బాలుడికి ప్రపంచంలోనే అతిపెద్ద సంపదలా అనిపించింది. ఆ నోటును జేబులో జాగ్రత్తగా పెట్టుకుని చాపపైకి చేరాడు. నిద్రలో కూడా చేతితో పట్టుకునే పడుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకే తయారై బయలుదేరాడు. బస్సుల రూట్లు మార్చుకుంటూ కొలిమిగుండ్ల చేరేసరికి జేబులో ఒక ఐదు రూపాయల నోటు, ఒకటిన్నర రూపాయి చిల్లర మిగిలాయి.
ఆఫీసుకు వెళ్లగానే MRO సీట్లో లేరని తెలిసింది. ఇక చేసేదేమీ లేక, ఆకలి వేస్తున్నా.. ఎక్కడ తను తినడానికి వెళ్లిన సమయంలో అధికారి వచ్చి వెళ్ళిపోతారో అన్న భయంతో ఆ ముళ్లకంప కిందనే కూర్చుండిపోయాడు.
కాలం నిశ్శబ్దంగా గడుస్తోంది. ఒంటి గంట అయింది.. రెండు అయింది.. మూడు గంటలు కూడా గడిచిపోయాయి. చెప్పులు లేని ఆ చిన్నారి కాళ్లు ఎండకు కాలుతున్న బండలపై అటూ ఇటూ నడుస్తూనే ఉన్నాయి.

IAS Gandham Chandrudu Story | జేబు దొంగగా మారిన వ్యవస్థలోని దర్పం
కార్యాలయం ఎదుట మరో దృశ్యం ఆ బాలుడికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. ఒక వ్యక్తి తెల్లటి బట్టలు వేసుకుని, కుర్చీలో కాలిమీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు. అక్కడికి వచ్చే సామాన్య ప్రజలు ఆయన ముందు చేతులు కట్టుకుని వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు.
ఆ బాలుడిని చూసి “ఏం కావాలి నీకు?” అని గద్దించాడు. సర్టిఫికెట్ అని చెప్పగానే, లోపల క్లర్క్ ఉంటాడు వెళ్లు అన్నాడు. తీరా దాదాపు మూడున్నర ప్రాంతంలో MRO వచ్చారు.
ఆయన రాగానే.. అంతవరకు కుర్చీలో దర్జాగా కూర్చున్న ఆ తెల్లబట్టల వ్యక్తి ఒక్క ఉదుటున లేచి, కుర్చీ పక్కకు జరిపి, వంగి వంగి నమస్కారాలు చేయడం చూసి ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు.
అధికారి రాగానే ఆ బాలుడు ఆశగా లోపలికి వెళ్లాడు. కానీ, అక్కడ అసలైన క్రూరత్వం వేచి ఉంది. అక్కడ ఉన్న బిళ్ల బంట్రోతు (అటెండర్) ఆ బాలుడి వైపు చూసి.. “నీ పని అయిపోయిందిలే, ఏమన్నా తెచ్చావా?” అని అడిగాడు. అమాయకత్వంతో ఉన్న ఆ 11 ఏళ్ల బాలుడికి ఆ మాటల అర్థం కాలేదు.
“ఏమన్నా తెచ్చావా అంటే చాలా చూస్తావేం? డబ్బులున్నాయా?” అని నేరుగా అడిగేశాడు. బాలుడు మౌనంగా ఉండిపోయాడు. అంతే.. ఆ బంట్రోతు ఆ బాలుడి ధ్రువ పత్రాన్ని పక్కన పడేశాడు. లంచం ఇచ్చే మిగతా వారందరికీ సర్టిఫికెట్లు ఇస్తూ, ఆ బాలుడిని వేధింపులకు గురిచేశాడు. కొందరు గోడ చాటున డబ్బులు ఇస్తుంటే, మరికొందరు చేతిలో చేయి కలిపి నోట్లు అందిస్తున్నారు.
ఒకవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉదయం నుంచి తినకపోవడంతో కడుపులో నకనకలాడుతున్న ఆకలి. తట్టుకోలేక ఆ బాలుడు మళ్లీ దగ్గరకు వెళ్లి “నా సర్టిఫికెట్ ఇవ్వండి సార్” అని దీనంగా అడిగాడు. “సరే ఇటు రా” అని పిలిచిన ఆ బంట్రోతు, ఆ బాలుడు ఊహించని విధంగా.. చొక్కా జేబులో నేరుగా చెయ్యి పెట్టేశాడు.
అందులో ఉన్న ఐదు రూపాయల నోటు, చిల్లరను క్షణాల వ్యవధిలో లాగేసుకున్నాడు. బాలుడు వెనక్కి జరగడానికి, చేతిని అడ్డుపెట్టడానికి ప్రయత్నించే లోపే ఆ దారుణం జరిగిపోయింది. డబ్బులు లాగేసుకున్నాకే స్టాంపు వేసి ఆ సర్టిఫికెట్ను బల్లపై విసిరేశాడు.
సర్టిఫికెట్ వచ్చిన ఆనందం కంటే.. జేబులో ఉన్న ఆఖరి పైసాను కూడా దోచుకున్నాడనే బాధ ఆ చిన్నారిని కలచివేసింది. కాసేపు అక్కడే నిలబడ్డాడు.. ఏమైనా కనికరించి బస్సు ఛార్జీలకైనా డబ్బులు ఇస్తాడేమోనని. కానీ, ఆ లంచగొండికి ఆ ధ్యాసే లేదు.

IAS Gandham Chandrudu Story | చీకటి దారిలో నడక..
సమయం సాయంత్రం ఐదున్నర అవుతోంది. జేబు ఖాళీ అయింది. సొంత ఊరు కోటపాడుకు వెళ్లడానికి బస్సు ఛార్జీలు లేవు. ఆ సమయంలో కొలిమిగుండ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని బెలుం గ్రామంలో నివసిస్తున్న మేనత్త (చిన్న సుబ్బమ్మ) గుర్తుకు వచ్చింది. కాలినడకన వెళ్లడం తప్ప మరో మార్గం లేదు.
ఆకలితో మాడుతున్న కడుపు.. దుమ్ము ధూళి కొట్టుకుపోయిన శరీరం. అయినా కులం సర్టిఫికెట్ను ఆ బాలుడు భద్రంగా ఒళ్లో దాచుకుని కాళ్లకు పని చెప్పాడు. ఆ దారి అంతా నాపరాళ్ల గనుల ప్రాంతం. సాయంత్రం ఐదు గంటల తర్వాత అక్కడ మనుషులెవరూ ఉండరు. పూర్తిగా నిర్మానుష్యమైన గతుకుల రోడ్డు.
భయం భయంగానే చిన్న అడుగులతో ప్రయాణం మొదలైంది. సూర్యుడు కొండల వెనక్కి వెళ్ళిపోతున్నాడు, చీకటి పడుతోంది. భయం తీవ్రమవడంతో ఆ బాలుడు పరిగెత్తడం ప్రారంభించాడు.
ఆయాసం వస్తే నడవడం, కాస్త శ్వాస అందితే మళ్లీ పరిగెత్తడం.. అలా ఆరు కిలోమీటర్ల దూరాన్ని ఆకలి కడుపుతో, గుండెను అరచేతిలో పెట్టుకుని దాటాడు. రాత్రి ఆరున్నర గంటలకు బెలుం గ్రామంలోని అత్తగారి ఇల్లు చేరేసరికి ఆ బాలుడి నోటి నుంచి మాటలు రావడం లేదు.
కేవలం నీళ్ల కోసం సైగ చేశాడు. జరిగిందంతా విని ఆ మేనత్త కన్నీరు మున్నీరైంది. ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని, అన్నం పెట్టింది. రాత్రంతా నొప్పులతో అల్లాడుతున్న ఆ పసి కాళ్లను ఒత్తుతూ ఆ లంచగొండి వ్యవస్థకు శాపనార్ధాలు పెట్టింది.

IAS Gandham Chandrudu Story | కోటపాడులో నిలిచిపోయిన పొయ్యి..
ఇక్కడ బాలుడు మేనత్త ఇంట్లో తలదాచుకుంటే.. అటు సొంత ఊరిలో తల్లిదండ్రులు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. రాత్రి ఎనిమిది గంటల చివరి బస్సు వచ్చినా కొడుకు దిగకపోవడంతో ఆ పేద తండ్రి గుండె ఆగిపోయినంత పనైంది.
చీకట్లో బస్టాండ్లో గంటల తరబడి వెతికాడు ఆ తండ్రి. నాాడు ఫోన్లు లేవు, సమాచారం తెలుసుకునే వీలు లేదు. ఇంటికి వచ్చి భార్యకు విషయం చెప్పగా.. ఆ తల్లి పెట్టిన కేకలు ఆ ఊరిని కుదిపేశాయి. కొడుకు వస్తే అందరం కలిసి తిందామని వండిపెట్టిన అన్నం అలాగే ఉండిపోయింది.
ఆ రాత్రంతా ఆ తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం ఆ బాలుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు, ఆ తల్లిదండ్రులు నీళ్లు కూడా ముట్టలేదు.

IAS Gandham Chandrudu Story | బాధితుడే బాస్ అయితే..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. విధి రాసే స్క్రీన్ప్లే అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆనాడు ఐదు రూపాయల లంచం కోసం ఒక ఐదో తరగతి బాలుడిని ఏడిపించిన అదే రెవెన్యూ వ్యవస్థను.. కాలం ఆ బాలుడి కాళ్ల చెంతకు తెచ్చింది.
ఆ కష్టాలను, అవమానాలను దిగమింగుకుని కసితో చదివిన గంధం చంద్రుడు.. 2010లో దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ (IAS) సాధించారు. ఆనాడు తను ఏ కార్యాలయం ఎదుట చెప్పులు లేకుండా నిలబడ్డాడో.. అదే రెవెన్యూ వ్యవస్థకు ‘జిల్లా కలెక్టర్’ హోదాలో అధిపతి అయ్యారు.
ఆనాడు ఆ చిన్నారి జేబులోంచి పోయిన ఐదు రూపాయలు.. నేడు వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక ఐఏఎస్ అధికారి ఆయుధంగా మారాయి. అనంతపురం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు శభాష్ అనిపించాయి.
డిజిటలైజేషన్ – పారదర్శకత: IAS Gandham Chandrudu Story: విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం ఆఫీసుల చుట్టూ, లంచగొండుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. సచివాలయాల వ్యవస్థను క్షేత్రస్థాయికి తీసుకెళ్లారు.
జవాబుదారీతనం: IAS Gandham Chandrudu Story: ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అవినీతి జరిగితే సహించేది లేదని, సామాన్యుడికి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు.
పేద విద్యార్థులకు అండ: IAS Gandham Chandrudu Story: నవోదయ, ఐఐటీ సీట్లు సాధించిన నిరుపేద విద్యార్థులకు ధ్రువపత్రాల జారీలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రత్యేక యంత్రాంగాన్ని నడిపారు.

IAS Gandham Chandrudu Story | సమాజానికి మిగిలిన ప్రశ్నలు..
గంధం చంద్రుడు తన కథను పంచుకుంటూ వ్యవస్థను ఎండగట్టారు. ఆయన ఐఏఎస్ అయ్యారు కాబట్టి కలం పట్టి సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఆవేదనను ప్రపంచానికి చాటిచెప్పగలిగారు.
తద్వారా వ్యవస్థలో కొంత మార్పును తీసుకురాగలిగారు. కానీ.. ఇక్కడ మిగిలిపోయిన అసలు ప్రశ్నలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సామాన్యులను వేధిస్తూనే ఉన్నాయి.
- IAS Gandham Chandrudu Story : రోజువారీ జీవితంలో కార్యాలయాల చుట్టూ తిరగలేక, లంచాలు ఇచ్చుకోలేక, చెప్పులు అరిగిపోయి చదువులను మధ్యలోనే ఆపేస్తున్న వేలాది మంది ‘గంధం చంద్రుడు’ల పరిస్థితి ఏమిటి?
- IAS Gandham Chandrudu Story: చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు వేళ్లూనుకుపోయిన ఈ అవినీతి ముళ్లకంపలను శాశ్వతంగా పెకిలించి వేసే రోజు ఎప్పుడు వస్తుంది?
- IAS Gandham Chandrudu Story: ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు చేతులు కట్టుకుని నిలబడే బానిసత్వ సంస్కృతి ఎప్పుడు మారుతుంది?

IAS Gandham Chandrudu Story : పాలనా వ్యవస్థకు ఒక హెచ్చరిక
గంధం చంద్రుడి “నా Certificate కథ” కేవలం ఒక గతాన్ని గుర్తుచేసే పాఠం కాదు. అది నేటి పాలనా వ్యవస్థకు ఒక హెచ్చరిక. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం అంతమొంది, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా సర్టిఫికెట్ కోసం కన్నీరు కార్చని రోజే.. ఆనాడు ఆ 11 ఏళ్ల బాలుడు అనుభవించిన గుండెకోతకు, ఆ తల్లిదండ్రులు పడ్డ కన్నీటి రాత్రికి మనం చేసే నిజమైన న్యాయం!
Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!
