అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: DGP CV Anand | రాష్ట్ర పోలీస్ శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన, ప్రజా అనుకూలమైన సేవలను అందించేందుకు స్టాండరైజ్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) అమలుకు ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్(Director General of Police CV Anand) సూచించారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
DGP CV Anand | ప్రజలకు మెరుగైన సేవలందించాలి..
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రతిఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు అందిస్తున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ, కేసుల నమోదు, దర్యాప్తు ప్రక్రియ, బాధితులకు సహాయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలలో ఏకరీతి విధానాలు పాటించాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, అక్రమ కార్యకలాపాల అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
DGP CV Anand | పోలీస్స్టేషన్లలో రికార్డుల నిర్వహణ..
అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీజీపీ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya), అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్(Nizamabad), ఆర్మూర్(Armoor), బోధన్, ట్రాఫిక్ సీటీసీ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.




