అక్షరటుడే, వెబ్డెస్క్: Tiger Attack Chandrapur | మహారాష్ట్ర (Maharashtra)లోని చంద్రాపూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తునికాకు (బీడీల ఆకు) సేకరణ కోసం తెల్లవారుజామున అడవికి వెళ్లిన మహిళలపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోయారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా (Chandrapur District) సిందేవాహి తాలూకాలోని గుంజవాహి-పవన్పార్ ప్రాంతంలో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి చెందారు. విదర్భ ప్రాంతంలోని చంద్రాపూర్ జిల్లాలో తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఉంది. ఆ ప్రాంతంలో తునికాకు సేకరణ కోసం 13 మంది మహిళలు అడవిలోకి వెళ్లారు. వారిపై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు.
Tiger Attack Chandrapur | తీవ్ర విషాదం
పులి దాడి (Tiger Attack)లో నలుగురు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అటవీ ప్రాంతంలోని గ్రామస్థులలో భయాందోళనలను రేకెత్తించగా, అటవీ శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. పులి దాడిలో మృతి చెందిన వారిని కవిత దాదాజీ మోహుర్లే (45), అనితా దాదాజీ మోహుర్లే (46), సంగీతా సంతోష్ చౌదరి (40), సునీతా కౌశిక్ మోహుర్లే (33)గా గుర్తించారు. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు.
కాగా అటవీ ప్రాంతాల్లోని ప్రజలు వేసవిలో తునికాకు సేకరించి విక్రయిస్తుంటారు. దీని ద్వారా ఉపాధి పొందుతారు. నిత్యం తెల్లవారు జామున అడవిలోకి వెళ్లి ఆకును సేకరిస్తారు. తాజా ఘటనతో అడవిలోకి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Private Hospitals Approval | తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. 8 వేల ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి


