అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mini Tank bund | నిజామాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ నెల రోజులుగా మూతపడి ఉందని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ప్రజలు, వాకర్స్, యువత, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
Mini Tank bund | పరువు పోతుందని గేట్లు తెరిపించారు..
నెల రోజులుగా మూతపడి మినీ ట్యాంక్ బండ్ను (బొడ్డెమ్మ చెరువు) అధికారులు లేదా ఎమ్మెల్యే తెరుస్తారేమో అని ప్రజలతో పాటు తాము కూడా ఎదురుచూశామని బిగాల అన్నారు. కానీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో నేడు ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే.. పరువు పోతుందని గ్రహించి హడావుడిగా గేట్లు తెరిపించారని ఆరోపించారు. నెల రోజులుగా మూసివేసి ఉంచిన గేట్లు ఒక్కసారిగా ఎలా తెరుచుకున్నాయని ప్రశ్నించారు. ప్రజల కోసం కాకుండా, తమ వైఫల్యం బయటపడకుండా ఉండేందుకు మాత్రమే గేట్లు తెరిపించడం ఎమ్మెల్యే రాజకీయ నాటకాలకు నిదర్శనమన్నారు.
Mini Tank bund | కనీస భద్రతా చర్యలు లేకపోవడం బాధాకరం
మినీ ట్యాంక్ బండ్ గేట్లు తెరిచిన తర్వాత అక్కడి పరిస్థితిని పరిశీలిస్తే అసలు వాస్తవం బయటపడిందని బిగాల తెలిపారు. గేటు వద్ద భద్రతా సిబ్బంది లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడం, ఎలాంటి నిర్వహణ కనిపించకపోవడం వల్ల మినీ ట్యాంక్ బండ్ పూర్తిగా అనాథలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రదేశంలో కనీస భద్రతా చర్యలు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, రమేష్, సీతారాం, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: IIT Advanced Results | ఐఐటీ అడ్వాన్డ్స్ ఫలితాల్లో కాకతీయ విద్యార్థుల ప్రభంజనం..


