గేమింగ్ ప్రపంచంలో ధోనీ సరికొత్త ఇన్నింగ్స్.. లైట్‌ఫ్యూరీ ‘ఈక్రికెట్’ కోసం జతకట్టిన భారత క్రికెట్ స్టార్లు

Shivam nagarani

భారత క్రికెట్ చరిత్రలో అపారమైన అనుభవం ఉన్న ఎంఎస్ ధోనీతో పాటు హైదరాబాద్‌కు చెందిన యువ కెరటం తిలక్ వర్మ మరికొందరు అగ్రశ్రేణి క్రికెటర్లు ఇప్పుడు గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఏఏఏ (AAA) స్థాయి గేమ్-టెక్ స్టూడియో అయిన ‘లైట్‌ఫ్యూరీ గేమ్స్’ రూపొందిస్తున్న సరికొత్త మొబైల్ గేమ్ ‘ఈక్రికెట్’ (eCricket) కు వీరంతా వ్యూహాత్మక మద్దతుదారులుగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఎంఎస్ ధోనీ, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా సాయి సుదర్శన్ భారీగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా, గేమ్‌లో ప్లేయబుల్ అవతార్‌లుగా కూడా క్రీడాకారులను అలరించనున్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ ఆవిష్కరణ
లైట్‌ఫ్యూరీ గేమ్స్ సంస్థ ఇప్పటివరకు వివిధ రౌండ్ల ద్వారా సుమారు 20 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను సమీకరించింది. బ్లూమ్ వెంచర్స్ వీ3 వెంచర్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలతో కలిసి భారత క్రికెట్ స్టార్లు ఈ 11 మిలియన్ డాలర్ల ప్రీ-సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగస్వాములయ్యారు. ఈ గేమ్‌ను కేవలం వినోదం కోసమే కాకుండా, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రీమియం స్పోర్ట్స్ గేమ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఎటువంటి డబ్బుతో కూడిన జూదం లేదా బెట్టింగ్ ఉండదు. బ్యాటింగ్ బౌలింగ్‌లో అత్యంత సహజమైన అనుభూతిని అందించేలా, అత్యాధునిక సాంకేతికతతో 100 మంది నిపుణుల బృందం ఈ గేమ్‌ను సిద్ధం చేస్తోంది.

నిజమైన క్రికెట్ అనుభవం కోసం ధోనీ సలహాలు
ఈ భాగస్వామ్యంపై మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గతంలో నేను చూసిన క్రికెట్ గేమ్‌లలో ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి మిగిలేది. కానీ లైట్‌ఫ్యూరీ గేమ్స్ వారు రూపొందిస్తున్న విధానం చూశాక, ఆ లోటు భర్తీ అవుతుందని నమ్మాను. భారత్ నుండి అంతర్జాతీయ స్థాయికి వెళ్లగలిగే గేమ్‌ను నిర్మించడం ఒక పెద్ద సాహసం. మైదానంలో నాకున్న అనుభవంతో, గేమ్‌లోని ప్రతి చిన్న అంశం పక్కాగా ఉండేలా నేను తగిన సలహాలు అందిస్తున్నాను” అని ధోనీ పేర్కొన్నారు. క్రికెట్ అభిమానులకు ఒక వాస్తవిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్త క్రికెట్ దిగ్గజాల కలయిక
లైట్‌ఫ్యూరీ గేమ్స్ సీఈఓ కరణ్ ష్రాఫ్ నేతృత్వంలో ఈ ఏడాది ‘ఈక్రికెట్’ మార్కెట్లోకి విడుదల కానుంది. కేవలం భారతీయ ఆటగాళ్లే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మందికి పైగా ప్రొఫెషనల్ క్రికెటర్లతో ఈ సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫలితంగా క్రిస్ గేల్, బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్, కేన్ విలియమ్సన్ వంటి అంతర్జాతీయ స్టార్లతో కూడా యూజర్లు గేమ్‌ను ఆడుకోవచ్చు. భారత్ నుండి గ్లోబల్ గేమింగ్ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఈ సంస్థను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *