అక్షరటుడే వెబ్డెస్క్: NEET Re Exam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ వివాదంపై ఒకవైపు సీబీఐ (CBI) ముమ్మర దర్యాప్తు జరుపుతుండగానే, సోషల్ మీడియాలో మరో కొత్త కలకలం మొదలైంది. జూన్ 21న జరగబోయే ‘నీట్ రీ-ఎగ్జామ్’ క్వశ్చన్ పేపర్లు తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని ముఠాలు సోషల్ మీడియాలో ఓపెన్గా ఆఫర్లు పెడుతున్నాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) లోని కొన్ని ఛానళ్లు ఈ దందాకు తెరలేపాయి. పరీక్షల షెడ్యూల్ను బట్టి రూ. 80,000 నుండి రూ. 1 లక్ష వరకు చెల్లిస్తే రీ-ఎగ్జామ్ పేపర్ ఇస్తామంటూ విద్యార్థులను నమ్మిస్తున్నాయి. ఈ డబ్బును ఇన్స్టాల్మెంట్లలో (విడతల వారీగా) కూడా చెల్లించవచ్చని ఆఫర్ ఇస్తున్నాయి. సుమారు 900 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక టెలిగ్రామ్ గ్రూపులో.. “ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించడానికి ఇదే మీకు చివరి అవకాశం.. వదులుకోవద్దు” అంటూ విద్యార్థులను ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు.
NEET Re Exam | అలర్ట్గా ఉండండి..
ఈ కొత్త మోసాలపై ‘ఇండియా వైడ్ పేరెంట్స్ అసోసియేషన్’ ప్రెసిడెంట్, అడ్వకేట్ అనుభా శ్రీవాస్తవ సహాయ్ స్పందించారు. “విద్యార్థులు ఎవరైనా ఇలాంటి గ్రూపుల్లో జాయిన్ అయినా, లేదా వీటి గురించి తెలిసినా.. వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కి లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి” అని ఆమె కోరారు. ఇలాంటి అక్రమ మార్గాలను నమ్ముకుంటే విద్యార్థుల డబ్బుతో పాటు విలువైన సమయం కూడా వృధా అవుతుందని, ఇలాంటి మాల్ప్రాక్టీస్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

NEET Re Exam | వచ్చే ఏడాది నుంచి ‘ఆన్లైన్’ పరీక్ష..
మే 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది (2027) నుండి నీట్ పరీక్షను సాంప్రదాయ ‘పెన్-అండ్-పేపర్’ విధానంలో కాకుండా, జేఈఈ (JEE) తరహాలోనే పూర్తిగా ‘కంప్యూటర్ ఆధారిత’ (Online) ఫార్మాట్లో నిర్వహిస్తామని ప్రకటించారు. మరోవైపు, జూన్ 21న జరగబోయే రీ-టెస్ట్ కోసం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ చైర్మన్ కె. రాధాకృష్ణన్లు బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా పెంచడం, భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయడంపై చర్చించారు.

NEET Re Exam | సీబీఐ దర్యాప్తు వేగవంతం..
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ బుధవారం మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరే, పూణేలోని ‘డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ’ లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న తేజస్ హర్షద్కుమార్ షా ఉన్నారు. వీరి అరెస్ట్తో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 13కు చేరింది.
ఇది కూడా చదవండి: TDP Mahanadu Donations | మహానాడులో కాసుల వర్షం.. తొలి రోజే టీడీపీకి రూ.12.44 కోట్ల విరాళాలు


