OBC Creamy Layer | తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు?: సుప్రీంకోర్టు

Shivam nagarani

అక్షరటుడే వుబ్‌డెస్క్: OBC Creamy Layer| దేశంలో ఓబీసీ (OBC) రిజర్వేషన్లు, క్రీమీ లేయర్ పరిమితులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాల పిల్లలకు ఇంకా ఓబీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు అవసరమా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో ఉండి, మంచి ఆదాయం సంపాదిస్తున్నప్పుడు వారి పిల్లలు కూడా రిజర్వేషన్లు కోరడంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటకకు చెందిన ఓ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి. నాగరాత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

OBC Creamy Layer | ఆ వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమా?

విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగారత్న స్పందిస్తూ.. “తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ (IAS) అధికారులు అయినప్పుడు వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి? విద్య, ఆర్థిక సాధికారతతో సామాజికంగా ఒక స్థాయికి రావడం సాధ్యమవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్లీ పిల్లలు రిజర్వేషన్లు కోరితే.. ఈ రిజర్వేషన్ కోటా విధానం నుంచి మనం ఎప్పటికీ బయటపడలేము. ఇది మనం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. తల్లిదండ్రులు చదువుకుని, మంచి ఉద్యోగాల్లో ఉంటూ, భారీగా సంపాదిస్తున్నా పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు కావాలా? వారు ఆ రిజర్వేషన్ల నుంచి బయటకు రావాలి. ఇందులో కొంత సమతుల్యత అవసరం” అని స్పష్టం చేశారు.

OBC Creamy Layer | అసలు కేసు నేపథ్యం ఏంటి?

కర్ణాటకకు చెందిన, వెనుకబడిన తరగతుల (కేటగిరీ II-A) కింద వర్గీకరించబడిన ‘కురుబ’ సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు ఎంపికయ్యాడు. అయితే, సదరు అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం సుమారు రూ. 19.48 లక్షలుగా ఉంది. అతని తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి ఉమ్మడి ఆదాయం నిర్ణీత క్రీమీ లేయర్ పరిమితిని మించిందని జిల్లా కుల, ఆదాయ ధృవీకరణ కమిటీ తేల్చింది. దీంతో అతనికి ఓబీసీ కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది.

OBC Creamy Layer | హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ..

దీనిపై సదరు అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి అభ్యర్థికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కానీ, కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేస్తూ.. అభ్యర్థి క్రీమీ లేయర్ పరిధిలోకి వస్తాడని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 1993లో ఇచ్చిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం క్రీమీ లేయర్ నిర్ధారణ కోసం జీతభత్యాలను మినహాయించాలనే నిబంధన కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకే వర్తిస్తుందని, కర్ణాటక రాష్ట్ర విధానానికి అది వర్తించదని హైకోర్టు పేర్కొంది. ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

OBC Creamy Layer | న్యాయవాది వాదనలు ఏంటి?

పిటిషనర్ తరపున న్యాయవాది శశాంక్ రత్నూ వాదిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులలో క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి కేవలం జీతం ఆదాయాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని కోరారు. ఒకవేళ కేవలం జీతాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే డ్రైవర్లు, ప్యూన్లు, క్లర్కులు వంటి తక్కువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా రిజర్వేషన్లు కోల్పోతారని వాదించారు. క్రీమీ లేయర్ మినహాయింపు అనేది తల్లిదండ్రుల గ్రూప్-ఎ, గ్రూప్-బి హోదాపై ఆధారపడి ఉండాలన్నారు. ఈ కేసులో పిటిషనర్ తండ్రి మూల వేతనం రూ. 53,900 కాగా, తల్లి మూల వేతనం రూ. 52,650 అని, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతను అంచనా వేసేటప్పుడు జీతభత్యాలను పరిగణనలోకి తీసుకోకూడదని ఆయన వాదించారు. అన్ని ఆదాయాలను లెక్కిస్తే ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్‌కు తేడా ఉండదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. చివరకు ఈ విజ్ఞప్తిపై స్పందిస్తూ సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి:  Telangana New Pensions | జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు : మంత్రి సీతక్క

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *