అక్షరటుడే, వెబ్డెస్క్: Stock Market Crash | పశ్చిమాసియాలో మూడున్నర నెలల క్రితం ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర దాడులు చేశాయి. టెహ్రాన్ సైతం ఊహించని విధంగా దీటుగా స్పందిస్తుండడంతో ఇది దీర్ఘకాలిక యుద్ధంగా మారిపోయింది.
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మÖసి వేసింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. యుద్ధానికి ముందు క్రూడాయిల్ (Crude oil) ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉండగా.. యుద్ధం మొదలయ్యాక ఒక దశలో 125 డాలర్ల స్థాయిని దాటింది. ప్రస్తుతం వంద డాలర్ల దిగువన కొనసాగుతోంది.
Stock Market Crash | భారత్పై ప్రభావం..
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం ప్రారంభమై వంద రోజులు దాటింది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులను సృష్టించింది. క్రూడ్ ఆయిల్ కోసం దిగుమతులపైనే ఆధారపడిన భారత్ (India)పై యుద్ధం ప్రభావం ఎక్కువగా పడింది. ఎక్కువ ధర వెచ్చించి ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో రూపాయిపై ఒత్తిడికి గురవుతోంది. మరోవైపు యుద్ధం ప్రారంభమయ్యాక విదేశీ సంస్థాగత మదుపరులు సుమారు 3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించారు. వీటి ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది.
Stock Market Crash | వంద రోజుల్లో భారీ నష్టం..
దేశీయ స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. నిఫ్టీ (Nifty) 50 ఇండెక్స్లో చాలా కంపెనీలు 10 శాతానికిపైగా విలువను కోల్పోయాయి. అత్యధికంగా ఆటో సెక్టార్కు చెందిన అశోక్ లేలాండ్ మార్కెట్ విలువ 32 శాతం పడిపోయింది. ఆ కంపెనీ షేరు ధర ఫిబ్రవరి 27న రూ. 211 వద్ద ఉండగా.. ప్రస్తుతం రూ. 143 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్ కమర్షియల్ వేహికల్స్ స్టాక్ ధర రూ. 505 నుంచి రూ. 363 కి తగ్గి, సుమారు 28 శాతం మేర మార్కెట్ విలువను కోల్పోయింది. మారుతి సుజుకీ ఇండియా షేరు ధర 12.2 శాతం మేర తగ్గి ప్రస్తుతం రూ. 13,010 వద్ద ఉంది.
Stock Market Crash | ఐటీలో సెల్లాఫ్..
నిఫ్టీ 50 ఇండెక్స్లోని ఐటీ స్టాక్స్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. టీసీఎస్ రూ. 2,637 నుంచి రూ. 2,141 కి తగ్గింది. అంటే ఆ కంపెనీ షేరు విలువ 19 శాతం మేర పడిపోయింది. ఇన్ఫోసిస్ రూ. 1,300 నుంచి రూ. 1,172 కు, హెచ్సీఎల్ టెక్నాలజీస్ రూ. 1,389 నుంచి రూ. 1,140 స్థాయికి క్షీణించాయి.
బ్యాంకింగ్ రంగంలో..
బ్యాంక్ నిఫ్టీలో హెవీవెయిట్ స్టాక్స్ సైతం గణనీయంగా తగ్గాయి. ఎస్బీఐ షేరు ధర రూ. 1,201 నుంచి రూ. 1,001 కి తగ్గి 17 శాతం మేర క్షీణించింది. హెచ్పీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర రూ. 887 నుంచి రూ. 739కి, యాక్సిస్ బ్యాంక్ రూ. 1,383నుంచి రూ. 1,279కి, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 1,379 నుంచి రూ. 1,272 కు పడిపోయాయి.
ఇతర ప్రధాన కంపెనీలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు 26 శాతం, భారత్ పెట్రోలియం షేర్లు 23.5 శాతం పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ. 1,394 నుంచి రూ. 1,264కు, ఐటీసీ రూ. 313 నుంచి రూ. 279 కి పడిపోయాయి. బజాజ్ ఫైనాన్స్ 11 శాతం విలువను కోల్పోయింది.
పీఎస్యూ బ్యాంక్స్లో..
బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 19.6 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 18.1 శాతం, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17 శాతానికిపైగా పడిపోయాయి.
ఇది కూడా చదవండి..: Zepto IPO ED Notice | ఐపీవో ముంగిట ‘జెప్టో’ కు ఈడీ షాక్