అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Urea Booking App | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్లో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)కి వినతిపత్రం అందజేశారు.
Urea Booking App | మండలాన్ని ప్రాతిపదికన తీసుకోవడం ద్వారా..
దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ బుకింగ్ యాప్లో మండల స్థాయిని ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా రైతులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. స్థానిక సొసైటీలు, ఫర్టిలైజర్ షాపులను అందుబాటులోకి తీసుకువస్తే యాప్లో యూరియాను బుకింగ్ చేసుకోవడం సులభతరం అవుతుందన్నారు. మండల కేంద్రం లేదా యాప్లో సూచించిన పంపిణీ కేంద్రాలు అనేక గ్రామాలకు దూరంగా ఉన్నాయన్నారు. దీంతో బుక్ చేసుకున్న అనంతరం యూరియా బస్తాల కోసం రైతులు ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులపై అదనపు రవాణా చార్జీలు కూడా పడుతున్నాయని వ్యయప్రయాసలకు గురవుతున్నారని వాపోయారు. ఈ సమస్య పరిష్కారానికి యాప్లో మండల యూనిట్కు బదులుగా రైతులకు అత్యంత చేరువలో ఉండే ప్యాక్స్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ దుకాణాలను చేర్చాలని ఆయన కోరారు.
Urea Booking App | ఎకరానికి ఎన్ని బస్తాల యూరియా..?

ప్రస్తుత సీజన్కు సంబంధించి జిల్లాలో రైతులు ఇప్పటికే వరినట్లు వేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారని దినేష్ తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఒక ఎకరానికి ఎన్ని బస్తాల యూరియా కేటాయిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. దీంతో రైతాంగంలో తీవ్ర అయోమయానికి రైతాంగం అయోమయానికి గురవుతుందని ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇస్తే రైతులు దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుంటారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం యూరియా కేటాయింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Student Union Harassment | విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలి..
