అక్షరటుడే వెబ్డెస్క్: Voter List Revision | ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (SIR – Special Integrated Revision) ప్రక్రియను చేపట్టే భారత ఎన్నికల సంఘం (EC) అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్య సాధనలో భాగంగానే ఈసీ ఈ చర్యలు తీసుకుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్ఐఆర్ విధానాన్ని ఉపయోగించడం ద్వారా ఎన్నికల సంఘం తన చట్టబద్ధమైన పరిధిని దాటి వ్యవహరించిందని చెప్పలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఇది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన ప్రక్రియ కాదని, పారదర్శకమైన ఎన్నికల కోసం తీసుకున్న రాజ్యాంగ ఆవశ్యకత అని ధర్మాసనం పేర్కొంది.
Voter List Revision | పిటిషనర్ల అభ్యంతరాలు ఇవే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం (1950) ప్రకారం ఎన్నికల సంఘానికి ఎస్ఐఆర్ నిర్వహించే విస్తృత అధికారాలు లేవని సవాలు చేస్తూ పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ పౌరసత్వాన్ని ధృవీకరిస్తోందని, ఇది “ఎన్ఆర్సి (NRC) లాంటి ప్రక్రియ” అని, ఈ అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని పిటిషనర్లు ఆరోపించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే ఎన్జీవోతో పాటు దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, గత జనవరి 29న తన తీర్పును రిజర్వ్ చేసింది.

Voter List Revision | కోర్టు తీర్పులోని అంశాలు..
ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పైలట్ ప్రాజెక్ట్గా మొదట బీహార్ రాష్ట్రంలో నిర్వహించారు. ఈ సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుండి దాదాపు 65 లక్షల మంది పేర్లను తొలగించినట్లు ఎన్నికల శాఖ వెల్లడించింది. ఈ సవరణ నోటిఫికేషన్ ప్రకారం.. 2002 లేదా 2003 ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్లు, అప్పట్లో జాబితాలో ఉన్న వారితో తమకున్న వంశపారంపర్య సంబంధాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Voter List Revision | ఈసీ వాదన..
ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను పౌరసత్వానికి ఖచ్చితమైన రుజువులుగా భావించలేమని, అందుకే ఈ సవరణ అవసరమైందని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం లేదా తీసేయడం పూర్తిగా తమ రాజ్యాంగ పరిధిలోని అంశమేనని స్పష్టం చేయగా, సుప్రీంకోర్టు కూడా అదే విషయాన్ని సమర్థించింది.
ఇది కూడా చదవండి: Lokesh Women Reservation | మహానాడు వేదికగా లోకేశ్ చేసిన ఆ భారీ ప్రకటన ఇదే!


