అక్షరటుడే, వెబ్డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న జియో పొలిటికల్ అనిశ్చితులు, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రజలకు చేసిన విజ్ఞప్తులు చర్చనీయాంశంగా మారాయి.
ఇంధన పొదుపు కోసం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచన ఇప్పుడు ఐటీ రంగం (IT Sector)లో సంచలనానికి దారితీసింది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం కారణంగా పెరుగుతున్న చమురు ధరల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ దిశగా ఆలోచించాలని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ సంఘాలు రంగంలోకి దిగాయి.
Work From Home | దిగుమతుల భారం తగ్గించుకునేందుకు..
అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా సరుకుల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. ప్రపంచంలోని చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచాయి. కానీ భారత్లో మాత్రం రూపాయి కూడా పెంచలేదు. అయితే ధరలు పెంచకపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాలను చూస్తున్నాయి. మరోవైపు దిగుమతుల భారంతో రూపాయి విలువ రోజురోజుకు క్షీణిస్తోంది. క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారి ద్రవ్యలోటు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ప్రజలు పొదుపు మంత్రం పాటించాలని, స్వదేశీ వస్తువులే ఎక్కువగా వాడాలని సూచించారు.
Work From Home | కదిలిన ఐటీ సంఘాలు..
ఇంధనాన్ని పొదుపు చేయడం కోసం వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ’నూ ప్రస్తావించారు. ఈ డిమాండ్ వెనక బలమైన కారణాలు ఉన్నాయి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు రోజూ ఆఫీసులకు వెళ్లడానికి సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ’తో పెట్రోల్, డీజిల్ వినియోగం కొంత తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది దేశ ఇంధన దిగుమతుల భారాన్ని ఎంతోకొంత తగ్గిస్తుంది.
ప్రధాని పిలుపుపై ప్రముఖ ఐటీ సంఘాలు స్పందించాయి. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (ఎన్ ఐటీఈఎస్ ) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఒక అత్యవసర విన్నపాన్ని పంపింది. ప్రభుత్వం అధికారికంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వైజరీ’ జారీ చేయాలని కోరుతున్నాయి. “కోవిడ్ సమయంలో మనం ఇంటి నుంచి పని చేయడానికి, వర్చువల్ సమావేశాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు దేశ ఆర్థిక భద్రత కోసం ఆ విధానాన్ని ఎందుకు ఉపయోగించకూడదు” అని ఐటీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..: Dowry Harassment Cases | మెట్రో నగరంలో వికృత పోకడ.. భారీగా వరకట్న వేధింపుల కేసులు

