అక్షరటుడే వెబ్డెస్క్:MSME Growth Summit|దేశ ప్రగతికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) వెన్నెముక లాంటివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువత తమ సరికొత్త ఆలోచనలను నిజం చేసుకోవడానికి ఈ రంగం ఒక చక్కని వేదికని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ‘ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్’లో పాల్గొన్న సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి స్టార్టప్ కంపెనీల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 38 పారిశ్రామిక పార్కులకు ఆయన శంకుస్థాపన చేశారు.
MSME Growth Summit | కీలక పాత్ర
వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చిన్న పరిశ్రమలేనని గుర్తుచేశారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ సదస్సు వేదికగా పలు రంగాల ఒప్పందాలకు శ్రీకారం చుట్టామని చెబుతూ.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కోటి ఎంఎస్ఎంఈలను ప్రారంభించడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
MSME Growth Summit | సరికొత్త ఐడియాలకు కేరాఫ్ అడ్రస్గా..
చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 550 పారిశ్రామిక పార్కులు ఉండగా, కొత్తగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సరికొత్త పారిశ్రామిక పార్కులు యువత నూతన ఆవిష్కరణలకు, సరికొత్త ఐడియాలకు కేరాఫ్ అడ్రస్గా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro Refinancing | మెట్రోకు గుడ్ న్యూస్.. రూ.13,600 కోట్లతో రీఫైనాన్సింగ్ ఒప్పందం