Wrong India Map | ఐపీఎల్ క్వాలిఫైయర్‌లో మ్యాప్ వివాదం.. లేజర్ షోలో భారత్ మ్యాప్ తప్పుగా చూపించారంటూ నెటిజన్ల ఆగ్రహం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Wrong India Map | ఐపీఎల్ 2026 (IPL 2026) క్వాలిఫైయర్-1 మ్యాచ్ సందర్భంగా ఊహించని వివాదం చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వహించిన లేజర్ లైట్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

మ్యాచ్ మధ్య విరామ సమయంలో ప్రదర్శించిన విజువల్స్‌లో భారతదేశ మ్యాప్ సరిగా చూపించలేదంటూ నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీసీఏ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bangalore), గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడ్డాయి. మిడ్ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో అభిమానులను ఆకట్టుకునేందుకు సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. దాదాపు 25 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఐపీఎల్ ట్రోఫీపై లేజర్ కాంతులతో భారతదేశ మ్యాప్ ప్రదర్శించారు.

Wrong India Map | ఆ ప్రాంతాలు కనిపించ‌లేదు..

అయితే ఆ మ్యాప్‌లో జమ్మూ కాశ్మీర్‌తో పాటు కొన్ని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలు కనిపించలేదని సోషల్ మీడియాలో పలువురు పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రసారంలో దీనిని గమనించిన అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఈ అంశంపై నిర్వాహకులు లేదా సంబంధిత అధికార సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్‌ల ఆధారంగా ఈ చర్చ కొనసాగుతోంది.

Wrong India Map | బెంగళూరు జట్టు భారీ స్కోరు

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఆ జట్టు కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిద‌ర్  అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ అభిమానులను అలరించాడు. ఈ మ్యాచ్​లో ఘన విజయం సాధించిన బెంగళూరు ఫైనల్​కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, చివరికి లేజర్ షోకు సంబంధించిన ఈ వివాదమే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: RCB vs GT | ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 నేడు.. ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మహా పోరు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *