అక్షరటుడే వెబ్డెస్క్: Harish Rao Criticism | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు (DEO) ఉన్నారని, మిగిలిన 30 జిల్లాల్లో పోస్టులను ఖాళీగా పెట్టడం దారుణమన్నారు. అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓలుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం వల్ల, వారు విద్యాశాఖపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థను గాలికి వదిలేయకుండా ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి రెగ్యులర్ డీఈఓలను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.

Harish Rao Criticism | రాజకీయ కక్షతో ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో అర్ధాంతరంగా నిలిపివేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పూర్తిగా నెమ్మదించిందని ధ్వజమెత్తారు. “మీకు ఇష్టమైతే పథకం పేరు మార్చుకోండి.. కానీ పేద పిల్లలు చదువుకునే బడుల ప్రగతిని మాత్రం ఆపకండి” అంటూ ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుత పాలనలో పాఠశాలల్లో కనీసం ఒక్క కొత్త గదిని కూడా నిర్మించే ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆరోపించారు.

Harish Rao Criticism | ఉపాధ్యాయులపై ఆర్థిక భారం..
పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి మరో నాలుగు నెలలు పెండింగ్లో పెట్టడంపై హరీశ్ రావు మండిపడ్డారు. ఈ బకాయిలు రాకపోవడంతో ఆ ఆర్థిక భారం అంతా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే పడుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, డీఏ (DA) సమస్యలను పరిష్కరించకపోగా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో చెల్లించకుండా ప్రభుత్వం వారిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందని హరీశ్ రావు విమర్శించారు.
ఇది కూడా చదవండి: Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్


