అక్షరటుడే, వెబ్డెస్క్: Amaravati Land Allotments | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి అభివృద్ధి, భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపుల అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి నిర్మాణం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించారు. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే కేటాయింపులు పొందిన సంస్థల్లో మూడు సంస్థలు వివిధ కారణాలతో తమ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించగా, మరో మూడు సంస్థలకు గతంలో కేటాయించిన స్థలాలకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో భూములు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
Amaravati Land Allotments | నారాయణ సమాధానం…

రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా ముంబైకి చెందిన పలు ప్రముఖ వ్యాపార, సినీ రంగ సంస్థలు అమరావతిలో భూములు కోరుతూ ముందుకు వచ్చాయని చెప్పారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ (Telugu Film Industry) నుంచి ఇప్పటివరకు స్టూడియోలు లేదా ఇతర నిర్మాణాల కోసం ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు అందలేదని స్పష్టం చేశారు. భూముల కేటాయింపులో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటిస్తోందని మంత్రి చెప్పారు. రాజధానిలో స్థలాలు కోరుతున్న సంస్థల ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఆయా సంస్థల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు, బ్యాలెన్స్ షీట్లు, పెట్టుబడి సామర్థ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Amaravati Land Allotments | వేలాది మంది రైతుల త్యాగం
రాజధాని నిర్మాణ పనులపై వస్తున్న పలు సందేహాలకు కూడా నారాయణ సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన డీజిల్ లేదా ఇతర నిర్మాణ సామగ్రి విషయంలో ఎలాంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కొన్ని భారీ నిర్మాణ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచనలు వచ్చినప్పటికీ, అమరావతి రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్రబిందువుగా ఉండటంతో ఇక్కడి పనులను నిలిపివేసే ఆలోచన లేదని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం వెనుక వేలాది మంది రైతుల త్యాగం ఉందని మంత్రి గుర్తు చేశారు.
Amaravati Land Allotments | 29 వేల మంది రైతులు

సుమారు 29 వేల మంది రైతులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి స్వచ్ఛందంగా భూములను ఇచ్చారని చెప్పారు. అయితే గత ఐదేళ్లలో రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. ప్రస్తుతం మళ్లీ పనులను వేగవంతం చేయడం ద్వారా రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నారాయణ తెలిపారు. ఈ దశలో నిర్మాణ పనులను నిలిపివేస్తే రైతులకు మరింత నష్టం జరుగుతుందని, అందుకే ఎలాంటి అవరోధాలు వచ్చినా రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Traffic Records Before Marriage | అల్లుడిపై ట్రాఫిక్ వెరిఫికేషన్.. ‘డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు ఉంటే పెళ్లే లేదు’ అన్న తండ్రి!


