అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Chain Theft | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విజయవాడలో విచిత్రమైన చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసిన బంగారు గొలుసును మింగేసి పోలీసులను తప్పించుకోవాలని చూసిన నిందితుడిని చివరకు పోలీసులు పట్టుకొని, వైద్యుల సహాయంతో బంగారు గొలుసును తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ (Vijayawada) ఎంజీ రోడ్డులోని బృందావన్ కాలనీలో 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా నివాసం ఉంటున్నారు. విశాఖపట్నం నుంచి ఉపాధి కోసం విజయవాడకు వచ్చిన ఓ యువకుడు బుధవారం ఉదయం వృద్ధుడి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం కత్తితో బెదిరించి వృద్ధుడి మెడలో ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
Gold Chain Theft | ఎనీమాతో..
గొలుసు లాక్కొనే సమయంలో అది తెగిపోవడంతో ఒక భాగం అక్కడే పడిపోయింది. దీంతో బాధితుడు వెంటనే కృష్ణలంక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. దర్యాప్తులో నిందితుడు రైలులో విశాఖపట్నంకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతని ఫొటోను విశాఖలోని రైల్వే రక్షణ దళం అధికారులకు పంపించారు. రైలులో నుంచి దిగిన వెంటనే నిందితుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Gold Chain Theft | దొంగిలించిన గొలుసును మింగేసి
తర్వాత విజయవాడ పోలీసులు (Vijayawada Police) ప్రత్యేక బృందాన్ని పంపించి నిందితుడిని తిరిగి నగరానికి తీసుకొచ్చారు. విచారణ సమయంలో నిందితుడు తాను దొంగిలించిన గొలుసును మింగేసినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు వైద్యులను సంప్రదించి పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు నిందితుడికి ఎనీమా చేయించగా, అతడి కడుపులో ఉన్న 25.5 గ్రాముల బంగారు గొలుసు ముక్క బయటకు వచ్చింది. దీంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చూపిన వేగం, చాకచక్యంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Bus Fire Accident | ఉలవపాడు హైవేపై ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. బస్సులో 35 మంది ప్రయాణికులు


