Uttar Pradesh Constable Exam | కానిస్టేబుల్​ ఉద్యోగాలకు 28.86 లక్షల మంది ‘పోటీ’.. నిరుద్యోగ భారతానికి నిలువుటద్దం!

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తోందో చెప్పడానికి గణాంకాలు అక్కర్లేదు, ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్షల దృశ్యాలు చూస్తే చాలు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttar Pradesh Constable Exam | దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తోందో చెప్పడానికి గణాంకాలు అక్కర్లేదు, ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో పోలీస్ కానిస్టేబుల్ రాతపరీక్షల దృశ్యాలు చూస్తే చాలు. కేవలం 32,679 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏకంగా 28.86 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అంటే.. ఒక్క పోస్టుకు సగటున 88 మంది పోటీ పడుతున్నారు. ‘మహా వికాసం’, ‘అమృత కాలం’ అంటూ పాలకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలోని చేదు నిజాలకు మధ్య ఉన్న అగాధాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది.

Uttar Pradesh Constable Exam | డిగ్రీలు, పీజీలు ఉన్నా.. ‘కానిస్టేబుల్’ పోస్టే దిక్కు!

ఈ 28 లక్షల మందిలో కేవలం ఇంటర్మీడియట్ చదివిన వారే లేరు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీజీలు చేసిన ఉన్నత విద్యావంతులు కూడా కానిస్టేబుల్ ఉద్యోగం కోసం లైన్లో నిలబడటం గమనార్హం. ఏళ్ల తరబడి చదివి, వేలకు వేలు ఫీజులు కట్టి సంపాదించిన డిగ్రీలు.. చేతిలో రూపాయి పెట్టలేకపోతుండటంతో, కనీసం ‘సర్కారీ కొలువు’ వస్తే జీవితం స్థిరపడుతుందనే ఆశతో యువత ఈ స్థాయి పోటీకి సిద్ధపడుతోంది.

ఒక పోస్టుకు 88 మంది పోటీ పడటం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోంది. చదువుకున్న యువతకు ప్రైవేట్ రంగంలో సరైన ఉపాధి లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

Uttar Pradesh Constable Exam | ‘పరీక్ష’ రాయడానికి ముందే మరో ‘పరీక్ష’!

మూడు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థుల పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత కూడా వహించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయి, అభ్యర్థులు కాలు పెట్టేందుకు కూడా స్థలం లేక అల్లాడిపోయారు.

రైళ్ల టాప్‌ల పైన, కిటికీలకు వేలాడుతూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని యువత ప్రయాణించారు.

పరీక్షా కేంద్రాల నగరాలకు చేరుకున్న అభ్యర్థులకు వసతి లేక, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై, ఫుట్‌పాత్‌లపైనే రాత్రంతా జాగారం చేశారు.

ఈ దృశ్యాలపై నెటిజన్లు సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రభుత్వంపై విమర్శల శరపరంపర గుప్పిస్తున్నారు. “అభ్యర్థుల నుంచి వందల కోట్లు పరీక్ష ఫీజుల రూపంలో వసూలు చేసిన సర్కారు, వారికి కనీసం అదనపు బస్సులు, రైళ్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయింది?”* అని నెటిజన్లు నిలదీస్తున్నారు.

Uttar Pradesh Constable Exam | ‘డిజిటల్ ఇండియా’లో.. ‘ఫుట్‌పాత్’ నిద్రలు!

మనం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్నామని మేధావులు వేదికలపై ఉపన్యసిస్తుంటే.. అదే దేశంలో ఒక చిన్న ఉద్యోగం కోసం యువత రైళ్ల తలుపులకు వేలాడుతూ కనిపించడం ఒక పెద్ద వైరుధ్యం. ఏటా కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీలు.. ఎన్నికల ప్రచారాలకే పరిమితమయ్యాయా..? అనే అనుమానం కలగక మానదు.

రాజకీయ నాయకులు బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతుంటే, నిరుద్యోగ యువత మాత్రం లోకల్ రైళ్లలో కనీసం నిలబడేందుకు చోటు కోసం కొట్టుకోవాల్సి వస్తోంది.

యువతను ‘దేశ భవిష్యత్తు’ అని పిలిచే పాలకులు, అదే భవిష్యత్తును ఇలా రోడ్లపై, రైల్వే స్టేషన్లలో గాలికి వదిలేయడం ఏ రకమైన ‘వికాసం’ అని విపక్షాలు, సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ పరీక్ష కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు.. ఇది దేశవ్యాప్త నిరుద్యోగ సంక్షోభానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా పాలకులు కేవలం కాగితాల్లో, ప్రకటనల్లో ఉద్యోగాల భర్తీ చూపించడం మానేసి.. క్షేత్రస్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, దేశంలోని మానవ వనరులు (యువశక్తి) ఇలా పరీక్షల పేరిట రైల్వే స్టేషన్లలోనే మగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి..: TMC MP Revolt | మమత కొంప ముంచిన టీఎంసీ ఎంపీలు!.. ఢిల్లీ వేదికగా బెంగాల్​ రాజకీయం.. ఎన్డీయే వ్యూహం ఫలించేనా?

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *