అక్షరటుడే వెబ్డెస్క్: NEET Protest | నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర భద్రతా దళాలు పెల్లెట్ గన్లు, లాఠీఛార్జ్ ఉపయోగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ ( Rahul Gandhi )గాంధీ తీవ్రంగా ఖండించారు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థిపై పెల్లెట్ గన్తో కాల్పులు జరపడం వల్ల అతని కన్ను తీవ్రంగా దెబ్బతిందని, మళ్లీ చూపు వస్తుందో లేదో కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నిరసనకారులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
NEET Protest | రాహుల్ గాంధీ డిమాండ్లు..
బాధిత విద్యార్థుల తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన అధికారులను వెంటనే విధుల్లోంచి తొలగించాలి. విద్యార్థులపై దాడులకు తెగబడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్మార్గపు చర్యకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
NEET Protest |కేంద్రంతో సీజేపీ చర్చలు..
మరోవైపు, రాజ్యాంగ క్లబ్ (Constitution Club)లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. లీకేజీ వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించడం, ఆందోళనల్లో విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవడం వంటి రెండు కీలక డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని సీజేపీ ప్రతినిధులు తెలిపారు. అయితే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై ఆలోచించడానికి ప్రభుత్వం సమయం కోరిందని, మలివిడత చర్చలు శనివారం జరగనున్నాయని వారు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..