అక్షరటుడే వెబ్డెస్క్: PoK Rawalakot Clashes | పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని రావల్కోట్లో నిరసనకారులపై జరిగిన దాడులు, అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. పీఓకేలో భద్రతా దళాలు చూపుతున్న క్రూరత్వంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ( Ranadhir Jaiswal )పేర్కొన్నారు.
PoK Rawalakot Clashes | జవాబుదారీగా నిలబెట్టాలని ..
పాకిస్థాన్ పాల్పడుతున్న దురాగతాలకు ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆశిస్తోంది. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి పాకిస్థాన్ వ్యూహాత్మకంగా తప్పుడు సమాచారాన్ని, నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తోందని రణధీర్ జైస్వాల్ ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ చేస్తున్న నిస్సహాయ ప్రయత్నమిదని ఆయన అభివర్ణించారు.

PoK Rawalakot Clashes | ఘర్షణలో 30 మంది మృతి..
పీఓకేలో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ని ప్రభుత్వం నిషేధించడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు జరిపిన కాల్పులు, దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, నిరసనకారులు గెరిల్లా తరహా దాడులకు పాల్పడటం వల్లే తాము తుపాకులకు పని చెప్పాల్సి వచ్చిందని పోలీసులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. ఈ పరిణామాలతో పీఓకే మరోసారి అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది.
ఇది కూడా చదవండి: Haridwar Water Tank Snakes | హరిద్వార్లో భయంకర దృశ్యం.. వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాములు
