అక్షరటుడే, కామారెడ్డి: Swami Doctorate | రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, సామాజిక సేవకుడు డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్కు అరుదైన గౌరవం దక్కింది. జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషికి గాను ఆయన డాక్టరేట్ అందుకున్నారు.
Swami Doctorate | న్యూఢిల్లీలో..
న్యూఢిల్లీలో(New Delhi) జరిగిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో స్వామికి గౌరవ డాక్టరేట్తో పాటు జాతీయ పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Magic Book of Records) ఆధ్వర్యంలో ఫరీదాబాద్లో ఘనంగా నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి శనివారం పలు రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. పలు ప్రముఖ దినపత్రికల్లో విలేకరిగా పనిచేసిన స్వామి ముదిరాజ్ ప్రస్తుతం సొంత పత్రికను నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు.
బీసీ సంఘం కామారెడ్డి (Kamareddy) జిల్లా యూత్ అధ్యక్షుడిగా యువత అభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, పేదలకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ గౌరవం జిల్లాకు, ముఖ్యంగా రాజంపేట మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టు మిత్రులు, బీసీ సంఘ నాయకులు, గ్రామస్తులు ఆయనను అభినందించారు. భవిష్యత్తులో సమాజ సేవ, జర్నలిజం రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
