అక్షరటుడే వెబ్డెస్క్: Delhi Baby Trafficking | సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని, పసిగుడ్డులను వస్తువుల్లా అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ ( Delhi ) పోలీసులు రట్టు చేశారు. రోహిణి ప్రాంతంలోని ఓ ఆసుపత్రి కేంద్రంగా సాగుతున్న ఈ అమానవీయ దందాలో ఆసుపత్రి యజమానితో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు. వారి చెర నుండి ఐదుగురు పసికందులను సురక్షితంగా రక్షించారు.
Delhi Baby Trafficking | లింగ వివక్షతో వ్యాపారం..
ఈ ముఠా పిల్లల రవాణాలోనూ వివక్ష చూపుతోంది. మగ శిశువుల కోసం రూ.6 లక్షల నుండి రూ.8 లక్షల వరకు వసూలు చేస్తుండగా, ఆడ శిశువులను అందులో సగం ధరకే (రూ.3 నుండి 4 లక్షలు) అమ్మడం విచారణలో వెల్లడైంది. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోని పేద కుటుంబాల నుంచి రూ.20 వేల నుండి లక్ష రూపాయలకే పిల్లలను కొనుగోలు చేసి, ఢిల్లీలో అధిక ధరలకు అమ్ముతున్నారు.

Delhi Baby Trafficking | భార్యాభర్తల్లా నటిస్తూ ..
పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు, ఈ ముఠా సభ్యులు కార్లలో పిల్లలను తరలించేటప్పుడు పురుషుడు, స్త్రీ కలిసి భార్యాభర్తల్లా నటిస్తూ వచ్చేవారని పోలీసులు తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారికి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఆసుపత్రి యజమాని తన వంతుగా నకిలీ డెలివరీ రికార్డులను, బర్త్ సర్టిఫికెట్లను సృష్టించేవాడు. గ్వాలియర్కు చెందిన ఒక జంటకు మగపిల్లాడిని అమ్మి, అదనపు డబ్బులు తీసుకుని కవలలు పుట్టినట్లు నకిలీ పత్రాలు ఇచ్చినట్టు ఆధారాలు దొరికాయి.
Delhi Baby Trafficking | అసలేం జరిగింది?
పహార్గంజ్ ప్రాంతంలో ఒక మహిళ అనుమానాస్పదంగా వేర్వేరు సమయాల్లో వేర్వేరు పసిపిల్లలతో తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కస్టమర్ల రూపంలో ముఠాను సంప్రదించారు. రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ ఇస్తుండగా, ముఠాలోని ప్రధాన మహిళా నిర్వాహకురాలిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మొత్తం నెట్వర్క్ను ఛేదించారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ ముఠా సుమారు 300 మందికి పైగా శిశువులను విక్రయించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఉన్న మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Narahari Illegal Assets | ఏసీబీ చరిత్రలోనే రికార్డు.. డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో కట్టలకొద్దీ బయటపడుతున్న అక్రమాస్తులు