అక్షరటుడే, భీమ్గల్: MLA Prashanth Reddy | మాజీ మంత్రి, బాల్కొండ(Balkonda) ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హైదరాబాద్లోని(Hyderabad) ఆయన నివాసంలో గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని తడ్వాయి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ‘యూరియా యాప్ రద్దు’ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆయనను అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు.
MLA Prashanth Reddy | అరెస్టులు చేయడం విడ్డూరం: ప్రశాంత్ రెడ్డి
ముందస్తు అరెస్టుపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూరియా యాప్(Urea App) వల్ల రైతాంగం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తాము శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే, హైదరాబాద్లో అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు.
MLA Prashanth Reddy | రైతులంటే సీఎంకు చులకన భావం..
ఢిల్లీకి 72 సార్లు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి మెట్రో రైళ్లపై సమావేశాలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని యూరియా గురించి అడిగే శ్రద్ధ లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి రైతులంటే చాలా చులకన భావం ఉందని విమర్శించారు. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఒకేసారి ఇవ్వకుండా కోతలు విధిస్తోందని, ఇటు రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి తెచ్చుకునే తెలివి లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా, రివర్స్లో అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి యూరియా కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, ఇబ్బందిగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
