అక్షరటుడే వెబ్డెస్క్: Child Marriage Prevention | మహారాష్ట్రలో ( Maharashtra ) బాల్య వివాహాలను సమర్థవంతంగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహ శుభలేఖపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే ఈ మేరకు అసెంబ్లీలో ప్రతిపాదనను వెల్లడించారు.
Child Marriage Prevention | నిబంధన అమలు ఇలా..
వివాహ సమయంలో వధూవరుల వయస్సును సులభంగా సరిచూసుకునేందుకు, నిబంధనల ప్రకారం వారికి సరైన వయస్సు ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానం పక్కాగా అమలయ్యేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఇందులో కేవలం తల్లిదండ్రులే కాకుండా, శుభలేఖలు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్లు, కల్యాణ మండపాలు, ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా భాగస్వాములను చేస్తారు. నిబంధనలను అతిక్రమిస్తే సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Child Marriage Prevention | రాజస్థాన్ మోడల్ స్ఫూర్తితో..
బాల్య వివాహాలు అధికంగా ఉండే రాజస్థాన్లో ఇటువంటి నిబంధన మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి అదితి తట్కరే గుర్తుచేశారు. అదే మోడల్ను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
Child Marriage Prevention | ప్రభుత్వ చర్యలు..
బీడ్, మరాఠ్వాడా వంటి గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వలస కార్మికుల కుటుంబాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వలస కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, పిల్లల రక్షణ కోసం చైల్డ్ కేర్ సెంటర్లను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న చర్యల వల్ల వివాహాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, 2025-26 సంవత్సరాలలోనే దాదాపు 1,434 బాల్య వివాహాలను అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారని మంత్రి వివరించారు.
ఇది కూడా చదవండి: Trump Iran Deal | ఆహార ధాన్యాల కొనుగోలుపై అమెరికా పెత్తనం.. అంగీకరించని ఇరాన్