అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Blood Donation | రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వినూత్న నిరసనకు దిగింది. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV), యువజన విభాగం (BRSY) ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
BRS Blood Donation | నిరసన వెనుక కారణం..
రైతుల సమస్యలను పట్టించుకోకుండా, వారి పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy )బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పార్టీ నేత బాల్క సుమన్ మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న రక్తదాహం తీర్చేందుకే మా విద్యార్థి విభాగం ఈ రక్తదానం చేస్తోంది. ఈ రక్తాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లి ఇస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRS Blood Donation | అడ్డుకున్న పోలీసులు
రక్తదాన కార్యక్రమం పూర్తయిన తర్వాత, సేకరించిన రక్తంతో కూడిన ప్యాకెట్లను తీసుకుని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు, విద్యార్థులు ప్రయత్నించారు. అయితే, అప్పటికే తెలంగాణ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుండి బలవంతంగా తరలించారు.
ఇది కూడా చదవండి: Telangana TET Results | టెట్ ఫలితాలు విడుదల