అక్షరటుడే, ఎల్లారెడ్డి: Navodaya Admissions | విలువలతో కూడిన నాణ్యమైన విద్యనందించడం జవహర్ నవోదయ విద్యాలయాల ప్రత్యేకత. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యను సెంట్రల్ లెవల్లో ఉచితంగా అందిస్తోంది జవహర్ నవోదయ విద్యాలయం. ఈ విద్యాలయాల్లో సీటు సాధించిన విద్యార్థులు ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నిశ్చింతగా చదువుకునే సువర్ణావకాశం ఉంది. జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో ప్రవేశ పరీక్ష నుంచి ఎంపిక వరకు ఢిల్లీ (Delhi)లోని ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగుతుంది.
Navodaya Admissions | కార్పొరేట్కు సరితూగేలా..
ఈ రోజుల్లో కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే కార్పొరేట్కు ధీటుగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్ఈ సిలబస్తో కూడిన విద్యా బోధనను ఈ విద్యాసంస్థల్లో అందిస్తారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతి గృహాలు, క్రీడా మైదానాలు ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే పాఠశాల సిబ్బందికి సైతం అక్కడే వసతి ఉండడంతో ఎల్లవేళలా వారి పర్యవేక్షణ ఉంటుంది. ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ లాంటి క్రమశిక్షణ అలవర్చే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. నవోదయలో చేరేందుకు ఆసక్తి ఉండి ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న బాలబాలికలు జూలై 30 2026లోపు అధికారిక నవోదయ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాలను నవోదయ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Navodaya Admissions | 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష..
విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ఆ స్థాయిలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షాకాలం రెండు గంటలు ఉంటుంది. ప్రతి విభాగంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు గాను 80 ప్రశ్నలుంటాయి. ఇందులో మెంటల్ ఎబిలిటీ, అంకగణితం (మ్యాథ్స్), భాషా పరీక్షకు (తెలుగు లేదా ఇంగ్లిష్) సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తారు.
Navodaya Admissions | ప్రవేశ పరీక్ష నవంబర్ 28న..
నవోదయలో ప్రవేశం కోరే విద్యార్థులు 01-05-2015 నుంచి 31-07-2017 మధ్య జన్మించిన వారై ఉండాలి. జూలై 2026-27 విద్యా సంవత్సరంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో తరగతి చదువుతూ ఉండాలి. ఈ ప్రవేశ పరీక్ష నవంబరు 28న 2026న జరుగుతుంది. 2 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షల్లో 80 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరిలో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతం నుంచి, మిగిలిన వారిని పట్టణాల నుంచి ఎంపిక చేస్తారు. ఫలితాలను 2027 మార్చిలో ప్రకటిస్తారు.
Navodaya Admissions | విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
– సీతారాం బాబు, నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్
జవహర్ నవోదయలో ప్రవేశానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు కొంచెం కష్టపడి చదివి, పరీక్ష రాస్తే సీటు సులభంగా వస్తుంది. నవోదయ విద్యాలయంలో సీట్లు ఇప్పిస్తామంటూ చెప్పే మధ్య దళారులను నమ్మొద్దు. సీబీఎస్ఈ విధానంలో ప్రవేశ పరీక్ష మొదలు ఎంపిక వరకు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది.
ఇది కూడా చదవండి..: Vamsi Goud | బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా రత్నగారి వంశీ గౌడ్