అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | రాష్ట్రంలోని పలు శాఖల్లో అవినీతి అధికారులు పాతుకుపోయారు. ఏళ్లుగా లంచాలు తీసుకుంటూ వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారు. ఇటీవల ఏసీబీ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దూకుడు పెంచింది. అయితే ఏ అధికారి ఇంట్లో సోదాలు చేసిన రూ.వంద కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగు చూడటం రాష్ట్రంలో అవినీతికి అద్దం పడుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది. ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు.
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం అతని నివాసంలో, అతని బంధువులు, బినామీలు ఇతర సహచరులకు చెందిన మరో 10 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు.
ACB Raids | ఆస్తుల వివరాలు

తనిఖీల సమయంలో ఏసీబీ ( ACB Raids ) అధికారులు మల్లారెడ్డి పేరిట 5 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 4 నివాస గృహాలు, 1 వాణిజ్య భవనం ఉన్నాయి. ఆయన పేరిట 8 ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. సుమారు రూ. 3.31 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ భార్య, అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద 3 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని త్వరలో తెరవనున్నారు. అవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సోదాల సమయంలో అధికారులు నిందితుడి వద్ద ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీ లభించాయి. ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉందని, నిందితుడైన అధికారిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్లోని నాంపల్లిలో ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Tractor Accident | ట్రాక్టర్ కింద గంటన్నరపాటు నరకయాతన.. స్థానికుల సమయస్ఫూర్తితో బయటపడ్డ వ్యక్తి