KTR on Kavitha Party | కవిత పార్టీపై కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Kavitha Party | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ సోదరి కల్వకుంట్ల కవిత ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కవిత పార్టీపై కేటీఆర్​ తాజాగా స్పందించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్​ సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​ (KCR) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జరిగిన చర్చపై ఆయన వివరాలు వెల్లడించారు. కవిత పార్టీపై స్పందిస్తూ.. చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయన్నారు. దేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అన్నారు. కొత్త పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కవిత కేసీఆర్​ను మర మనిషని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. కేసీఆర్‌ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

KTR on Kavitha Party | ఉద్యమాలు చేస్తాం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేశామని కేటీఆర్​ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అలాగే ధాన్యం సేకరించాలని డిమాండ్​ చేశారు. లేదంటే గ్రామాల్లో రైతులతో ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

KTR on Kavitha Party | సభ్యత్వ నమోదు

బీఆర్ఎస్ (BRS) పార్టీ రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేశామని కేటీఆర్​ వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేస్తామన్నారు. సంస్థగతంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బూత్ స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో పార్టీ నూతన కమిటీలు వేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.

KTR on Kavitha Party | బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ఫైర్​

తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ, వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడంతో పాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను సమావేశం తీవ్రంగా ఖండించిందని కేటీఆర్​ అన్నారు. పార్లమెంటులో ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలున్నా.. ఉత్సవ విగ్రహాల్లా కూర్చుని చూశారు తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటుని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, దామోదర్ రావు ముందుగా ఖండించారన్నారు.

 

దీనిని కూడా చదవండి : Revanth Reddy | బీఆర్​ఎస్ శవంతో సమానం.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *