అక్షరటుడే, వెబ్డెస్క్: Revanth Reddy | బీఆర్ఎస్ (BRS)పై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ శవంతో సమానమన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పార్టీ పెట్టారని, ఆ పర్పస్ సాల్వ్ అయిందన్నారు. శవానికి ఎంత అలంకరణ చేసినా తిరిగి ప్రాణం రాదని, బీఆర్ఎస్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉందన్నారు. ఆ పార్టీకి ఘన చరిత్ర ఉండొచ్చు కానీ, భవిష్యత్తు మాత్రం లేదన్నారు.
అసెంబ్లీ ఆవరణలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్లో మాట్లాడారు. బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. రాజకీయాల్లో ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుందన్నారు. అది నెరవేరిన తర్వాత దానికి ప్రాముఖ్యత ఉండదని చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మనుగడ దాదాపు ముగిసిందని వ్యాఖ్యానించారు.
Revanth Reddy | కవిత పార్టీపై..
కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు. కొత్త పార్టీ గురించి మనకు ఎందుకన్నారు. ఉన్న పార్టీ ఉంటుందా. ఉండదో చూడండని సెటైర్ వేశారు. కేసీఆర్ తనకు ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరారు. వారసత్వ రాజకీయాల కోసమే కొందరు ఆయన చెడు కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy | అహంకారంతో..
పదేళ్ల అధికారంలో బీఆర్ఎస్ నాయకులకు అహంకారం, గర్వం వచ్చాయని రేవంత్రెడ్డి విమర్శించారు. దీంతో ప్రజలు 2023 ఎన్నికల్లో ఓడించారన్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో (Parliamentary Elections) ఒక్క సీటు కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం తమ ఉనికిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతోందని విమర్శించారు.
Revanth Reddy | సీబీఐ డైరెక్టర్ను కలుస్తాం
కాళేశ్వరం విషయంలో కోర్టు తీర్పుపై రేవంత్రెడ్డి స్పందించారు. కమిషన్ నియామకం ఏక పక్షమని ఎక్కడా కోర్టు చెప్పలేదన్నారు. కమిషన్ నియామకం చట్టబద్ధమేనని.. జీవో కొట్టేయడం కుదరదని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అయినా బీఆర్ఎస్ నాయకులు తాము గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. సెక్షన్ 8B, 8C ప్రకారం.. ప్రస్తుతం చర్యలు వద్దని మాత్రమే కోర్టు చెప్పిందని తెలిపారు. కమిషన్ నివేదిక యధాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం (Kaleshwaram)పై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే ఇటీవల హరీశ్రావు ఢిల్లీ వెళ్లారన్నారు.
Revanth Reddy | రాష్ట్రంలో రెండు కూటములు
తెలంగాణ రాష్ట్రంలో రెండు కూటములు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, కోదండరాం ఒక కూటమి అని, బీఆర్ఎస్, బీజేపీ మరో కూటమి అన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Heatwave | హైదరాబాద్లో ముదురుతున్న ఎండలు.. 42 డిగ్రీలకు చేరిన వేడి తీవ్రత!

