అక్షరటుడే, వెబ్డెస్క్ : Supreme Court Lathi Charge | శాంతియుత నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
నీట్ పేపర్ లీకేజీపై నిరసనల్లో భాగంగా జూలై 20న పార్లమెంటు వైపు విద్యార్థులు చేపట్టిన ‘సంసద్ చలో’ పాదయాత్రపై భాష్పవాయువు, లాఠీల ప్రయోగం జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. శాంతియుత, చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా ఇవ్వబడిందని కోర్టు పేర్కొంది. అది శాంతియుత ఆందోళన అయినంత వరకు, కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జికి ఆస్కారం లేదని స్పష్టం చేసింది.
Supreme Court Lathi Charge | దేశవ్యాప్తంగా..
పోలీసుల మితిమీరిన చర్యల ఆరోపణలను స్వతంత్రంగా పరిశీలించాలని, దేశవ్యాప్తంగా ప్రదర్శనలను నిర్వహించడానికి ఏకరీతి పోలీసు నియమావళి అవసరమని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసుల కుటుంబాల తరఫున హాజరైన ఒక న్యాయవాది, విచారణలో పాల్గొనడానికి చేసిన అభ్యర్థనను కూడా కోర్టు అనుమతించింది. జస్టిస్ బాగ్చి స్పందిస్తూ.. పోలీసులు, విద్యార్థులు గాయపడటం అనేది సమానంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి పోలీసులకు తగిన పరికరాలు ఎందుకు ఇవ్వలేదనే దానిపై దృష్టి సారించాలని కోరుతామన్నారు.
Supreme Court Lathi Charge | సమగ్ర విచారణ జరపాలి
ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, సీసీ టీవీ ఫుటేజ్, బాడీ-కెమెరా రికార్డింగ్లు, ఇతర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరచాలని పిటిషనర్లు కోరారు. గాయపడిన నిరసనకారులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల గొంతులను అణచివేయడానికి ప్రభుత్వం ఏకే-47లు, పెల్లెట్ గన్లతో సహా తీవ్రమైన బలప్రయోగాన్ని ఉపయోగిస్తోందని సోమవారం రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Akhilesh Yadav | విద్యా రంగాన్ని నాశనం చేసిన బీజేపీ : అఖిలేశ్ యాదవ్