అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police Review | నేరాల నివారణతో పాటు ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర ( SP Rajesh Chandra) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి(Kamareddy) పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు.
Kamareddy Police Review | పెండింగ్ కేసులపై..
పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ గ్రేవ్ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జ్షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్, పోక్సో, మహిళలపై నేరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ తదితర కేసుల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీటీఎన్ఎస్ ద్వారా కేసు రికార్డులను నిర్ణీత సమయంలో అప్లోడ్ చేయాలని, వాటిని క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలని, స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.
Kamareddy Police Review | గంజాయి రవాణాపై కఠిన చర్యలు
జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠినచర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సైబర్ బాధితులకు తక్షణ స్పందన అందించడంతో పాటు కోల్పోయిన డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రజల్లో సైబర్ నేరాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేరాల నివారణలో భాగంగా ప్రతి అధికారి గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచార వ్యవస్థను బలోపేతం చేసి కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి బైండోవర్ చర్యలు చేపట్టాలని, అవసరమైతే కొత్త రౌడీషీట్లు తెరవాలని సూచించారు.
Kamareddy Police Review | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా..
ప్రతి గ్రామం, పట్టణంలోని ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, దాబాల వద్ద కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఉన్న కెమెరాలను తరచూ తనిఖీ చేసి సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని ఎస్హెచ్వోలకు ఆదేశించారు. డయల్-100కు వచ్చే ప్రతి కాల్పై వెంటనే స్పందించి బాధితులకు తక్షణ సహాయం అందించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నాకాబందీలు, నైట్ పెట్రోలింగ్ను సమర్థంగా నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూధన్, శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మూడేళ్లలోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన NIMS..