అక్షరటుడే, భీమ్గల్(వేల్పూర్): Vemula Prashanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ (Balkonda) ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నిన్న నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ (Rythu Ashirvada Sabha) అసలు ఆశీర్వాద సభ కాదని, అది అన్నదాతల ‘శాపనార్థాల సభ’ అని ఆయన పేర్కొన్నారు.
Vemula Prashanth Reddy | అర్ధరహితమైన ఖర్చులు.. అరకొర సాయం
గతంలో కేసీఆర్(KCR) ప్రభుత్వం ఎలాంటి ఆర్భాటాలు, వృథా ఖర్చులు లేకుండా, కేవలం ఒక ప్రెస్ మీట్ ద్వారా 11 సీజన్లలో రూ. 73 వేల కోట్ల రైతుబంధు నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.28 వేల కోట్ల రైతుబంధు బకాయిలు పెట్టి, అందులో నుంచి కేవలం రూ. 2500 కోట్లు విదిల్చి, దానికోసం వందల కోట్లతో సభలు పెట్టడం “చారాణా కోడికి బారాణా మసాలా” చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
Vemula Prashanth Reddy | రుణమాఫీలోనూ మోసం..
ఎన్నికల సమయంలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 50వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ. 21వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. “రుణమాఫీ కాదు.. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మాఫీ అయ్యింది” అని ఆయన అన్నారు.
Vemula Prashanth Reddy | అప్పుల చిట్టాపై సమాధానం ఏది?
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 3 లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని, ఆ నిధులతో మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి శాశ్వత సంపదను సృష్టించామని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఈ నిధులతో ఏం అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | ప్రజాధనం వృథా ఆపండి
‘నేను మాట ఇస్తే తప్పను’ అని ప్రగల్భాలు పలికే రేవంత్ రెడ్డి, మాట తప్పడం ప్రపంచంలోనే 8వ వింతగా మారిందని విమర్శించారు. అనవసరమైన ప్రకటనలు, సభల కోసం ప్రజాధనాన్ని తగలేయడం ఆపి, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల తరపున బుద్ధి చెప్పాల్సి వస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో రేగుంట దేవేందర్, జెడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలియా, ఆర్మూర్ మహేష్, బద్దం చిన్నారెడ్డి, రేగుల్లా రాములు, బద్ధం అశోక్, కుంట ప్రతాపరెడ్డి, పాపాయి పవన్, బోగా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తొలిసారి ప్రయాణించిన ట్రంప్