అక్షరటుడే, వెబ్డెస్క్: Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు సంబంధించి మూడు రోజుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్షకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. ఈ నెల 16, 17, 18 తేదీలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం కాంగ్రెస్కు తెలియజేసిందని సమాచారం.
పార్టీ అంతర్గతంగా, ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని కాంగ్రెస్ పేర్కొన్నట్లు సమాచారం. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోవడంతో, గత ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందలేకపోయింది. ఏప్రిల్ నాటి ఓటింగ్ సమయంలో 528 మంది ఎంపీలు హాజరుకాగా, మూడింట రెండు వంతుల మెజారిటీకి 352 ఓట్లు అవసరమయ్యాయి. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రాగా, 54 ఓట్ల తేడాతో అది వీగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించుకుంది.
Delimitation Bill | ఫిరాయింపులతో..
తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి పలువురు ఎంపీలు ఎన్డీఏలో చేరారు. దీంతో బిల్లుల ఆమోదానికి కావాల్సిన సంఖ్యాబలం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యసభలో కూడా ఎన్డీయే మూడింట రెండు వంతుల మెజారిటీకి చేరువలో ఉంది. దీంతో ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు.
ఇది కూడా చదవండి..: Supreme Court Protests | విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. సంయమనం పాటించాలంటూ హెచ్చరిక