అక్షరటుడే వెబ్డెస్క్: Damodara Rajanarsimha Comments | తెలంగాణ శాసనసభ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై అధికార కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై సభ తరఫున కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభలో కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు.
Damodara Rajanarsimha Comments | స్పీకర్ స్థానం అందరిదీ..
సభలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీల చరిత్ర కేవలం ఒక వర్గానికి పరిమితం కాదని, అది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, కానీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను, అత్యున్నత పదవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్పీకర్ స్థానం ఏ ఒక్క కులానికో, మతానికో చెందింది కాదని.. అలాంటి పీఠంపై కూర్చున్న వ్యక్తిని అవమానించడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదని ధ్వజమెత్తారు.
Damodara Rajanarsimha Comments | ఏకగ్రీవంగా ఆమోదం..
మంత్రి దామోదర ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka )పూర్తిగా బలపరుస్తూ మాట్లాడారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం తరఫున కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు ఎమ్మెల్సీలపై చర్యలకు సంబంధించిన అధికారిక తీర్మాన కాపీని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ ఎమ్మెల్సీలపై త్వరలోనే మండలి వేదికగా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్