Kohli Umpire Controversy | హోల్డర్ క్యాచ్‌పై వివాదం.. అంపైర్లతో కోహ్లీ వాగ్వాదం, చర్యలు తీసుకుంటారా?

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kohli Umpire Controversy | ఐపీఎల్ 2026 (IPL 2026)లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ, ఆట కంటే ఎక్కువగా ఓ వివాదాస్పద క్యాచ్ సంఘటన చర్చనీయాంశమైంది.

ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ ఖాన్ వేసిన షార్ట్ బాల్‌ను రజత్ పాటిదార్ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో గాల్లోకి లేపాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జేసన్ హోల్డర్ వేగంగా పరిగెత్తి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించడంతో సందేహాలు వ్యక్తమయ్యాయి.

Kohli Umpire Controversy | కోహ్లీపై చర్యలు ఉంటాయా?

అయినప్పటికీ థర్డ్ అంపైర్ ‘అవుట్’గా ప్రకటించడంతో ఆర్‌సీబీ ఆటగాళ్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ వెంటనే బౌండరీ లైన్ వద్దకు వచ్చి ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బంతి స్పష్టంగా నేలకు తగిలిందని, ఇది నాట్ అవుట్‌గా ప్రకటించాల్సిందని కోహ్లీ (Virat Kohli) వాదించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.బీసీసీఐ ప్రవర్తనా నియమావళి ప్రకారం అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. గతంలో నితీష్ రాణా ఇదే సీజన్‌లో అంపైర్‌తో వాగ్వాదం చేయడంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా ఎదుర్కొన్నారు. అదే తరహాలో కోహ్లీపై కూడా జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకవేళ దీనిని ‘లెవల్ 2’ నేరంగా పరిగణిస్తే, మ్యాచ్ నిషేధం కూడా విధించే అవకాశాలు ఉన్నాయి.

Kohli Umpire Controversy | పవర్‌ప్లేలోనే కోహ్లీ అవుట్

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీకి కోహ్లీ మెరుపు ఆరంభం ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు కొట్టి స్కోర్‌ను వేగంగా పెంచాడు. కానీ పవర్‌ప్లేలోనే కోహ్లీ అవుట్ కావడం, ఆ తర్వాత పాటిదార్ వివాదాస్పద నిర్ణయంతో వెనుదిరగడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఈ ఘటనతో పాటు కోహ్లీపై సంభవించే క్రమశిక్షణ చర్యలు మరింత ఒత్తిడిని తీసుకురావచ్చు. దీంతో రాబోయే మ్యాచ్‌లపై కూడా దీని ప్రభావం పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *