అక్షరటుడే, వెబ్డెస్క్ : Ambati Rambabu Comments | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం రగిలింది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan)పై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సాధించిన ఘనవిజయం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అంబటి రాంబాబు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా చేసిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడు (Tamilnadu)లో విజయ్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించగా, పవన్ కళ్యాణ్ మాత్రం పొత్తులతో ఎన్నికల్లో గెలిచారని పరోక్షంగా ఆయనపై సెటైర్లు వేశారు. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు” అంటూ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
Ambati Rambabu Comments | రాజకీయ రగడ..
ఈ వ్యాఖ్యల ద్వారా సినీ నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ స్వతంత్రంగా విజయాన్ని అందుకోగా, పవన్ కళ్యాణ్ మాత్రం మిత్రపక్షాల సహకారంతోనే విజయాన్ని సాధించారని సూచించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ట్వీట్కు జనసేన, టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో అంబటి మరో ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవిష్యత్తుపై కూడా వ్యాఖ్యానించారు. తమిళనాడులో ఎం.కే. స్టాలిన్ – ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితులే భవిష్యత్తులో ఏపీలో నారా చంద్రబాబు నాయుడు – నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వానికి ఎదురవుతాయని జోస్యం చెప్పారు.
Ambati Rambabu Comments | ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా
అంబటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. “ముందు మీకు ఉన్న 11 సీట్లను కాపాడుకోండి” అంటూ సోషల్ మీడియా (Social Media)లో ప్రతిస్పందిస్తూ వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి, తమిళనాడు ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు మరో రాష్ట్రంలో మాటల యుద్ధానికి దారితీస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి..: Visakhapatnam Railway Zone | విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. గెజిట్ జారీ చేసిన కేంద్రం

