అక్షరటుడే, వెబ్డెస్క్: Paddy Farmers | ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం, ఇతర పంటలను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పంటలు కోసి నెల రోజులు అవుతున్నా.. ధాన్యం కొనడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
రాష్ట్రంలో యాసంగిలో ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. మక్కలు, శనగలు సైతం కొందరు వేశారు. అయితే పంటల కొనుగోళ్లు సక్రమంగా సాగడం లేదు. ఓ వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు (Farmers) ధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మృతి చెందారు. తాజాగా అకాల వర్షం నుంచి పంటలను కాపాడుకోవడానికి వెళ్లి లక్షెట్టిపేటలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
గాలివాన రావడంతో బుధవారం ఉదయం ధాన్యం కుప్పల వద్దకు వెళ్లిన రైతులు.. అక్కడ ఓ షెడ్లో నిల్చోగా వానకు అది కూలిపోయింది. దీంతో నలుగురు చనిపోయారు. ఇటీవల మెదక్ జిల్లా (Medak District) హవేళి ఘన్పూర్ మండలం బూర్గుపల్లిలో ధాన్యం కుప్ప వద్ద పిడుగు పడి చింతల శ్రీనివాస్ అనే రైతు మృతి చెందాడు. నకిరేకల్ పట్టణంలో ఓ రైతు చనిపోయాడు. ఇలా రైతులు చనిపోతున్నా.. ధాన్యం కొనుగోళ్లలో మాత్రం వేగం పెంచడం లేదు.
Paddy Farmers | లారీలు రాక..
ధాన్యం కొనుగోళ్లు నత్తనడనక సాగుతున్నాయి. లారీలు రాకపోవడంతో కాంటాలు వేసిన బస్తాలు పేరుకుపోతున్నాయి. దీంతో కొత్తగా కాంటా చేయడం లేదు. కేంద్రానికి ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్నా కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
Paddy Farmers | రైస్ మిల్లర్ల దోపిడీ
ఇప్పటికే కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతుంటే, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు వారిని దోపిడీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాకు 43 కిలోల వరకు తూకం వేస్తున్నారు. అలాగే మిల్లుకు వెళ్లిన తర్వాత తరుగు పేరిట లారీకి కొన్ని బస్తాలను తీసేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా అధికారులు అటువైపు చూడటం లేదు. కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రైతుతు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Railway Bypass Launch | రైల్వే బైపాస్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

