Kailasagiri Trishul | కైలాసగిరిపై భారీ త్రిశూలం.. వైజాగ్ టూరిజానికి మరో కొత్త ఆకర్షణ..!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kailasagiri Trishul | సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖపట్నం (Vishakapatnam)లో టూరిజం రంగం రోజురోజుకీ మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే బీచ్‌లు, కొండలు, రోప్‌వేలు, గ్లాస్ బ్రిడ్జ్‌లు, టాయ్ ట్రైన్‌లతో దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న వైజాగ్.. ఇప్పుడు మరో కొత్త ఆకర్షణతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

అదే కైలాసగిరిపై ఏర్పాటు చేసిన భారీ త్రిశూలం. వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో నిర్మించిన ఈ భారీ త్రిశూలం ఇప్పుడు నగరానికి మరో ప్రత్యేక గుర్తింపుగా మారబోతోంది. శివుడి ప్రధాన ఆయుధమైన త్రిశూలాన్ని ఆధునిక డిజైన్‌తో, డమరుకం ఆకృతితో కలిపి 65 అడుగుల ఎత్తులో నిర్మించారు.

Kailasagiri Trishul | వైజాగ్‌లో ఎక్కడి నుంచైనా కనిపించేలా ప్లాన్

ఈ త్రిశూలాన్ని కైలాసగిరి (Kailasagiri) కొండపై ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఇది స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారు. పగటిపూట ఆధ్యాత్మిక చిహ్నంలా కనిపించే ఈ నిర్మాణం.. రాత్రివేళల్లో మాత్రం మరింత అద్భుతంగా మెరిసిపోనుంది. త్రిశూలానికి 110 వాట్ల శక్తివంతమైన ఎల్ఈడీ లైట్లు (LED Lights) అమర్చడంతో చీకట్లో కూడా ఇది కాంతులు విరజిమ్ముతుంది. దీంతో రాత్రివేళల్లో కూడా పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యేక స్పాట్‌గా మారనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం వీఎంఆర్డీఏ దాదాపు రూ.2.50 కోట్లు ఖర్చు చేసింది. త్రిశూలం డిజైన్‌ను మహారాష్ట్రలోని పుణే లో రూపొందించి, అక్కడే తయారు చేసి తర్వాత వైజాగ్‌కు తరలించి ఇన్‌స్టాల్ చేశారు.

Kailasagiri Trishul | పర్యాటకులకు కొత్త అనుభవం అందించాలనే ఉద్దేశంతో..

65 అడుగుల ఎత్తు గల ఈ భారీ త్రిశూలంలో డమరుకం మాత్రమే 25 అడుగుల పొడవుతో ఉండగా, దాని వెడల్పు 18 అడుగులు. పర్యాటకులు సెల్ఫీలు తీసుకునేందుకు, కూర్చుని సేదతీరేందుకు చుట్టూ ప్రత్యేక వేదికను కూడా నిర్మించారు. వైజాగ్ తీర ప్రాంతం కావడంతో తరచూ తుఫాన్లు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుంది. అందుకే ఈ త్రిశూలాన్ని ప్రత్యేక మోడరన్ టెక్నాలజీతో నిర్మించారు. ట్రాన్స్‌లూసెంట్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించిన ఈ నిర్మాణం భారీ గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. “టూరిజంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కలిపి పర్యాటకులకు కొత్త అనుభవం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాం” అని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ భారీ త్రిశూలాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరుకానున్నారు.

Kailasagiri Trishul | కైలాసగిరిని “బెస్ట్ టూరిస్ట్ స్పాట్”గా ఎంపిక

కైలాసగిరి ఇప్పటికే వైజాగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ప్రతి ఏడాది లక్షలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి నుంచి సముద్ర తీరాన్ని వీక్షించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కైలాసగిరిని “బెస్ట్ టూరిస్ట్ స్పాట్”గా ఎంపిక చేసింది. విశాఖ రైల్వే స్టేషన్‌ (Visakhapatnam Railway Station)కు సుమారు 10 కిలోమీటర్లు, ద్వారకా బస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఈ భారీ త్రిశూలాన్ని సందర్శించేందుకు ఎలాంటి ప్రత్యేక ఫీజు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వీకెండ్స్‌, హాలిడేస్‌లో కుటుంబాలతో కలిసి వెళ్లే వారికి ఇది మరింత ఆకర్షణీయమైన ప్రదేశంగా మారనుంది.

ఇది కూడా చదవండి..: Nara Lokesh Durga | ఇంద్రకీలాద్రిపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *