అక్షరటుడే వెబ్డెస్క్:Intermediate Board Negligence|ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల చిన్న పొరపాటు ఒక విద్యార్థిని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన కర్లపూడి కావ్య అనే విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో అధికారుల అజాగ్రత్తకు బలైంది. అన్ని సబ్జెక్టుల్లోనూ టాపర్గా నిలిచిన కావ్యకు, బోటనీలో మాత్రం కేవలం 5 మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో చూపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్య, తన మీద తనకు నమ్మకం ఉండటంతో తల్లిదండ్రుల సహకారంతో రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసింది. ఫలితాల రీవాల్యూయేషన్ తర్వాత అసలు నిజం బయటపడటంతో అందరూ విస్తుపోయారు.
Intermediate Board Negligence|అసలేం జరిగింది?
కావ్యకు బోటనీలో నిజానికి 60కి 60 మార్కులు వచ్చాయి. సమాధాన పత్రంలో దిద్దిన టీచర్ ప్రతి ప్రశ్నకు ఫుల్ మార్కులు వేసినప్పటికీ, ఆ డేటాను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సిబ్బంది ఘోర తప్పిదం చేశారు. 60 మార్కులకు బదులుగా కేవలం 5 మార్కులు మాత్రమే కంప్యూటర్లో ఎంటర్ చేయడంతో ఆమె మార్కుల జాబితాలో ‘ఫెయిల్’ అని వచ్చింది.
Intermediate Board Negligence|తల్లిదండ్రుల ఆవేదన..
ఈ ఘటనపై కావ్య తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. స్టేట్ టాపర్గా నిలవాల్సిన విద్యార్థినిని ఇలా ఫెయిల్ అని ప్రకటించడం బోర్డు పనితీరులోని లోపాలను ఎత్తిచూపుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bandi Sanjay Son Posters | ‘పోస్టర్’ రోగం.. తెలంగాణలో కొత్త రాజకీయం!


