అక్షరటుడే, వెబ్డెస్క్: Work From Home | అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు గతంలో కరోనా సమయంలో అనుసరించిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) పద్ధతిని మళ్లీ ప్రారంభించాలని మోడీ సూచించారు.
Work From Home | ఆన్లైన్ మీటింగ్స్కు ప్రాధాన్యం
కొవిడ్ కష్టకాలంలో మనం నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రధాని మోడీ కోరారు. “కరోనా సమయంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్స్ల వంటి కొత్త వ్యవస్థలను అలవాటు చేసుకున్నాం.. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఆ పద్ధతులను మళ్లీ అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది..
ఇది భారత దేశ హితం కోసం మనం చేసే పెద్ద పని అవుతుంది..” అని మోడీ పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి నుంచే విధులు నిర్వహించడం వల్ల ఇంధన ఆదా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Work From Home | దుబారా తగ్గించండి..
దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రజలు తమ వ్యక్తిగత ఖర్చుల విషయంలో నిగ్రహం పాటించాలని మోడీ కోరారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన పొదుపు పాటించాలన్నారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించాలని కోరారు. అవసరమైతే కార్పూలింగ్ (వాహనాలను పంచుకోవడం) చేయాలని మోడీ సూచించారు.
బంగారం కొనుగోళ్లు: కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని మోడీ కోరారు. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు.
విదేశీ ప్రయాణాలు: విదేశాల్లో వివాహాలు, విహారయాత్రల వంటి ఆడంబరాలకు పోవద్దని కోరారు. దేశీయ పర్యాటకాన్నే ప్రోత్సహించాలని సూచించారు.
ఆర్థిక క్రమశిక్షణ: వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్నారు. తద్వారా దిగుమతుల భారం తగ్గుతుందని మోడీ పేర్కొన్నారు.
Work From Home | దేశభక్తి అంటే బాధ్యతగా జీవించడమే!
“దేశభక్తి అంటే సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు.. కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటూ మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం కూడా దేశభక్తే..” అని మోడీ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రజలు కూడా ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
Modi on Gold Purchase | ఏడాది పాటు బంగారం కొనొద్దు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు

