అక్షరటుడే, వెబ్డెస్క్ : Sirish Reddy Comments | తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తుపై టాలీవుడ్లో గత కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని, ప్రస్తుత రెంటల్ విధానంతో కొనసాగడం అసాధ్యమవుతోందని తెలంగాణ ఎగ్జిబిటర్లు (Telangana Exhibitors) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ (Hyderabad)లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించి, ‘సేవ్ సింగిల్ స్క్రీన్స్.. మాకు పర్సంటేజీ సిస్టమ్ కావాలి’ అనే నినాదంతో ప్రెస్ మీట్ నిర్వహించింది.ప్రస్తుతం అమల్లో ఉన్న రెంట్ లేదా రెంట్-కమ్-పర్సంటేజీ విధానం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఆచరణయోగ్యం కాదని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. థియేటర్లను నిలబెట్టాలంటే పూర్తిస్థాయి పర్సంటేజీ షేరింగ్ విధానం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Sirish Reddy Comments | ఇండస్ట్రీలోనే లేడు..
ఏడాదిలో దాదాపు 40 వారాల పాటు నిర్మాతలు ఈ విధానాన్ని అంగీకరిస్తున్నారని, పెద్ద సినిమాల విడుదల సమయంలో కూడా కనీసం మరో 10 వారాలు ఇదే పద్ధతిని కొనసాగించాలని కోరారు. ఇటీవలి కాలంలో సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ప్రదర్శితం కావడం లేదని ఎగ్జిబిటర్లు తెలిపారు. ఒకప్పుడు ‘ఎఫ్ 2’ వంటి సినిమాలు ఎనిమిది వారాలకు పైగా ఆడేవని, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా కొద్ది రోజుల్లోనే రన్ ముగిస్తున్నాయని అన్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయని, ఒకేసారి భారీ స్థాయిలో థియేటర్లలో సినిమా విడుదల కావడం వల్ల సింగిల్ స్క్రీన్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు.అలాగే ‘పుష్ప’ వంటి భారీ చిత్రాలను ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలోనే ప్రదర్శించారని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ అవకాశం ఇవ్వకపోవడం అసమానత అని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.
Sirish Reddy Comments | నిర్మాత శిరీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కోవిడ్కు ముందు అమలులో ఉన్న రెంటల్ విధానాన్ని ఇప్పటికీ కొనసాగించడం వల్ల తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదురవుతోందని తెలిపారు. రిస్క్, రివార్డులను నిర్మాతలు, ఎగ్జిబిటర్లు సమానంగా పంచుకుంటేనే పరిశ్రమ ఆరోగ్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాత శిరీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా టికెట్ ధరలు పెంచబోమని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. పర్సంటేజీ విధానం గురించి మాట్లాడటానికి కారణం ఎగ్జిబిటర్ల జీవన పోరాటమే తప్ప, ఏ నిర్మాతను లేదా ఏ సినిమాను టార్గెట్ చేయడం కాదని ఆయన వివరించారు.
Sirish Reddy Comments | నిర్మాతకు తన సినిమా ధర నిర్ణయించే హక్కు
“ఒక హీరోకి తన రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది. నిర్మాతకు తన సినిమా ధర నిర్ణయించే హక్కు ఉంది. మరి కోట్ల రూపాయలు పెట్టి థియేటర్ నిర్మించిన ఎగ్జిబిటర్కు హక్కులు ఉండవా?” అంటూ శిరీష్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో థియేటర్లు నడవడం లేదని చెప్పినప్పుడు ‘మూసేయండి’ అన్న నిర్మాత ఇప్పుడు ఇండస్ట్రీలో లేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి..: Nagarjuna T Shirts | నాగార్జున ఫొటోలతో టీ-షర్టుల విక్రయం.. ఢిల్లీ హైకోర్టు సీరియస్!

