అక్షరటుడే, వెబ్డెస్క్ : Sugar Export Ban | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని పేర్కొంది.
దేశీయంగా ధరలను నియంత్రించడం, స్థానిక సరఫరాలను పరిరక్షించడం, అలాగే ఉత్పత్తి, ప్రపంచ వస్తు మార్కెట్ల చుట్టూ పెరుగుతున్న అనిశ్చితికి సిద్ధపడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చక్కెర నిషేధించింది. దేశీయ ఉత్పత్తి డిమాండ్ కంటే ఎక్కువగా ఉంటుందనే అంచనాతో ఈ సీజన్లో 15.9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చక్కెరను ఎగుమతి చేయడానికి గతంలో ప్రభుత్వం అనుమతించింది. అయితే తాజాగా ఎగుమతులు నిషేధించడం గమనార్హం.
Sugar Export Ban | తగ్గిన ఉత్పత్తి
ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ (Brazil) మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి తగ్గింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి కీలక ఉత్పత్తి రాష్ట్రాలలో చెరకు దిగుబడులు బలహీనపడటంతో, వరుసగా రెండవ సంవత్సరం కూడా తాను వినియోగించే దానికంటే తక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేయబడింది. ఎల్నినో సంబంధిత వాతావరణ అంతరాయాలు, రుతుపవనాల అనిశ్చితి వచ్చే చక్కెర సీజన్ను కూడా దెబ్బతీస్తాయనే భయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Sugar Export Ban | పెరుగుతున్న ధరలు
దేశీయ చక్కెర ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో రూపాయి బలహీనత, పెరుగుతున్న ముడిచమురు ధరలు, విస్తృత దిగుమతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పోరాడుతున్న వేళ, ఇది ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచుతోంది. దీంతో ప్రభుత్వం ఎగుమతుల నుంచి దేశీయ సరఫరా పరిరక్షణకు ప్రాధాన్యతను మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నిషేధం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులకు వర్తిస్తుంది. అమెరికా (America), యూరోపియన్ యూనియన్కు చేసే కొన్ని కోటా ఆధారిత ఎగుమతులకు మినహాయింపు కొనసాగుతుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Flight Ticket Prices | ప్రయాణం ‘గగన’మే!.. గణనీయంగా పెరిగిన విమాన టికెట్ల ధరలు


