అక్షరటుడే వెబ్డెస్క్:Red Fort Bomb Blast|ఢిల్లీలోని ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) వద్ద 2025 నవంబర్ 10న జరిగిన భయంకరమైన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక పురోగతి సాధించింది. ఈ ఘోరానికి పాల్పడిన 10 మంది నిందితులపై గురువారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ 7,500 పేజీల భారీ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. వాహనంలో అమర్చిన పేలుడు పదార్థం (VBIED) ద్వారా జరిగిన ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
Red Fort Bomb Blast|కుట్ర వెనుక ‘ఆపరేషన్ హెవెన్లీ హింద్’ ..
దర్యాప్తు సంస్థ నివేదిక ప్రకారం, ఈ కుట్ర వెనుక అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన ‘అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్’ (AGuH) హస్తం ఉంది. వీరంతా భారత ప్రభుత్వాన్ని కూలదోసి షరియా పాలనను అమలు చేయాలనే లక్ష్యంతో “ఆపరేషన్ హెవెన్లీ హింద్” అనే కుట్రకు తెరలేపారు. తొలుత టర్కీ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత, వీరు 2022లో శ్రీనగర్లో రహస్యంగా సమావేశమై ఈ ఉగ్రవాద మాడ్యూల్ను ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
Red Fort Bomb Blast|సూత్రధారులుగా వైద్య నిపుణులు ..
ఈ కేసులో అత్యంత భయంకరమైన కోణం ఏమిటంటే.. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వైద్య నిపుణులే ఈ విధ్వంసానికి సూత్రధారులుగా మారడం. ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఈ కుట్రకు ప్రధాన కర్తగా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం మరణించగా, డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపును నిర్ధారించారు. ఛార్జిషీట్లో పేర్కొన్న ఇతర నిందితుల్లో ఆమిర్ రషీద్ మీర్, జసీర్ బిలాల్ వానీతో పాటు మరో ఐదుగురు వైద్యులు (ముజమిల్ షకీల్, అదీల్ అహ్మద్, షాహీన్ సయీద్ తదితరులు) ఉన్నారు.
Red Fort Bomb Blast|అధునాతన ఆయుధాలతో ప్రయోగాలు ..
నిందితులు ఆన్లైన్ , ఆఫ్లైన్ వనరులను ఉపయోగించి ప్రత్యేక ప్రయోగశాల పరికరాలను సేకరించినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది. సాధారణంగా లభించే రసాయనాలతో అత్యంత శక్తివంతమైన ‘ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్’ (TATP) పేలుడు పదార్థాలను వీరు స్వయంగా తయారు చేశారు. కేవలం కారు బాంబులే కాకుండా, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఈడీ (IED)లను అమర్చిన డ్రోన్లు , రాకెట్ల వంటి అధునాతన ఆయుధాలపై కూడా వీరు ప్రయోగాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Red Fort Bomb Blast|బలమైన ఆధారాలు..
ఎన్ఐఏ దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో 588 మంది సాక్షుల వాంగ్మూలాలు, 395 కీలక పత్రాలు , 200కు పైగా భౌతిక సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. అల్-ఫలాహ్ వర్సిటీతో పాటు జమ్మూ-కాశ్మీర్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన ఫోరెన్సిక్ , డిజిటల్ డేటా కేసును మరింత పటిష్టం చేసింది. నిందితులపై యూఏపీఏ (UAPA), పేలుడు పదార్థాల చట్టం , ఆయుధాల చట్టం కింద కఠినమైన సెక్షన్లతో విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: AP Work From Home | ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇంధన పొదుపుపై చంద్రబాబు కీలక ఆలోచనలు


