అక్షరటుడే వెబ్డెస్క్:Voter List Revision|భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా, దోషరహితంగా మార్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా 16 రాష్ట్రాలు , 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) మూడవ దశ ప్రక్రియను గురువారం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లను తొలగించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ భారీ కసరత్తు ముఖ్య ఉద్దేశ్యం.
Voter List Revision|36 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు అధికారులు..
ఈ మూడవ దశ ప్రక్రియలో భాగంగా సుమారు 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులను (BLOలు) రంగంలోకి దించింది. వీరికి తోడుగా రాజకీయ పార్టీల తరపున నియమించబడిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) కూడా ఈ ధృవీకరణ ప్రక్రియలో పాల్గొంటారు. వీరంతా నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించి, జాబితాను అప్డేట్ చేస్తారు.
Voter List Revision|తెలుగు రాష్ట్రాల్లో భారీ కసరత్తు..
ఈ సవరణ ప్రక్రియలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4.16 కోట్ల మంది, తెలంగాణలో 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించనున్నారు. అటు మహారాష్ట్రలో అత్యధికంగా 9.86 కోట్ల మంది ఓటర్ల వివరాల ధృవీకరణ కోసం దాదాపు లక్ష మంది అధికారులను ఈసీ కేటాయించింది. కర్ణాటక, హర్యానా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో ప్రక్షాళన కొనసాగుతుంది.
Voter List Revision|మే నుంచి అక్టోబర్ వరకు..
ఈ సవరణ ప్రక్రియ 2026 మే నెలలో ప్రారంభమై అక్టోబర్ వరకు కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం ఒడిశా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో మే 30 నుంచే ఇంటింటి ధృవీకరణ మొదలవుతుంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో జూన్ చివరి వారంలో ఈ ప్రక్రియ మొదలై, అక్టోబర్ 7 నాటికి తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మంచు ప్రాంతాలైన హిమాచల్, లడఖ్ వంటి చోట్ల తదుపరి దశలో ప్రత్యేకంగా షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ స్పష్టం చేసింది.
Voter List Revision|పారదర్శక ఎన్నికలే లక్ష్యం..
ఓటర్ల జాబితాలో ఒకే పేరు రెండు చోట్ల ఉండటం, చనిపోయిన వారి పేర్లు అలాగే కొనసాగడం వంటి ఫిర్యాదులకు ఈ సర్వేతో చెక్ పడనుంది. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు కూడా ఈ దశలో అవకాశం కల్పిస్తారు. గత రెండు దశల్లో ఇప్పటికే 59 కోట్ల మంది వివరాలను సవరించిన ఈసీ, ఈ మూడవ దశతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ


