Revanth Reddy Nalgonda | తోడేళ్లలా తిరుగుతున్నారు”.. కేటీఆర్, హరీశ్‌ రావులపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ప్రజా పాలనకు నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Nalgonda | ప్రజా పాలనకు నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్‌లో పర్యటించిన ఆయన, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సుమారు రూ. 13 వేల కోట్ల విలువైన ‘హ్యామ్’ (HAM) రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నల్గొండ కార్పొరేషన్‌లో రూ. 83 కోట్లతో తాగునీటి శుద్ధి కేంద్రానికి, తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు ఆయన పునాది వేశారు.

Revanth Reddy Nalgonda | త్యాగాలకు, దోపిడీకి తేడా ఇదే..

ఎన్‌జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “త్యాగం అంటే 1969లో పదవిని వదులుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీది. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది అసలైన త్యాగం” అని పేర్కొన్నారు. ఉద్యమకారుల త్యాగాలను టీఆర్ఎస్ నేతలు తమ ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా శ్రీకాంతాచారి ప్రాణత్యాగం, వందలాది ఉద్యమకారుల బలిదానాలను గుర్తు చేస్తూ, వేల కోట్లు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలో వందేళ్ల విధ్వంసం సృష్టించిందని విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌ రావులను ఉద్దేశించి తోడేళ్లలా తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

revanth.1 4

Revanth Reddy Nalgonda | పేదల సంక్షేమమే మా లక్ష్యం..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం పేదలను, మహిళలను గౌరవిస్తూ పాలన సాగిస్తోందని సీఎం అన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటివి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకుల కడుపు మండుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం 30 నెలల్లోనే రైతులకు రూ. 1.56 లక్షల కోట్ల ఆర్థిక భరోసా కల్పించి, అన్నదాతలను ఆదుకుందని వివరించారు.

Revanth Reddy Nalgonda | అభివృద్ధిపై బహిరంగ సవాలు..

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. “అసెంబ్లీ వేదికగా మేనిఫెస్టోలపై ఎన్ని రోజులైనా చర్చిద్దాం.. సిద్ధమా?” అని ప్రశ్నించారు. ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్టును పదేళ్ల పాటు పక్కన పెట్టిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు మూసీ కాలుష్యం కంటే తమపై విషాన్ని చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, ఆ పార్టీకి ప్రజలే ఉప్పుపాతర వేశారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఉన్న ఆ జానెడు వ్యక్తిని కూడా గెలవనియ్యబోమని సీఎం ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Chhatron Ki Goonj | విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం: డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *