అక్షరటుడే, వెబ్డెస్క్: Southwest Monsoon Kerala | ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త తెలిపింది. ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇప్పటికే అండమాన్ నికోబార్ ప్రాంతాల వైపు రుతుపవనాల కదలికలు ప్రారంభమైనట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి క్రమంగా ముందుకు సాగుతూ మే 26వ తేదీ నాటికి కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Southwest Monsoon Kerala | తెలంగాణలో..
కేరళను తాకిన అనంతరం మరో నాలుగు నుంచి ఐదు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా అధికంగానే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మిగతా జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ను దాటుతున్నాయి. మధ్యాహ్న వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.
అయితే కొన్ని జిల్లాలకు వర్ష సూచనలు ఉండటం కొంత ఊరటనిస్తోంది. నేడు (శనివారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.
Southwest Monsoon Kerala | బయటకు రావొద్దు
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, తగినంత నీరు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరోవైపు రైతులు కూడా రుతుపవనాల రాకపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదైతే వ్యవసాయ కార్యకలాపాలు సమయానికి ప్రారంభమయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు.


