అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Sand Transport | ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాలో ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Sand Transport | నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు..
నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించబోమని, ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల ద్వారా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు లభించిన తర్వాతే పోతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీర నది (Manjeera river) నుండి ఇసుక రవాణాకు అనుమతించినట్లు వెల్లడించారు. టీజీఎండీసీ (TGMDC) ద్వారా నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఇసుక రవాణా కొనసాగుతోందని, తన ఆదేశాల మేరకు బోధన్ ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి ఈ మేరకు నివేదిక అందించారని అన్నారు. వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని, ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకే ఇసుక వాహనాలకు అనుమతిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Sand Transport | జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా..
టీజీఎండీసీ ద్వారా కొనసాగుతున్న కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు, తూకంలో తేడా లేకుండా, ఓవర్ లోడ్కు ఆస్కారం లేకుండా సీసీ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ(GPS Tracking System) ద్వారా ఇసుక లోడ్తో వెళ్తున్న వాహనం వెళ్లే దారిని ఆన్లైన్లో టీజీఎండీసీ ప్రధాన కార్యాలయంలో గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మిగతా ఇసుక రీచ్ల నుంచి మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ట్రాక్టర్లలో ఇసుక రవాణాకు అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి విస్తృత తనిఖీలు జరిపిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణా పారదర్శకంగా జరుగుతోందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : Kodagu Elephant Clash | ఏనుగుల ఘర్షణ.. మహిళ మృతి


