అక్షరటుడే, వెబ్డెస్క్ : AI Social Media Surveillance | సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ (soceye) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ప్రారంభించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను గమనించేందుకు దీనిని రూపొందించారు.
ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. అంతేగాకుండా విద్వేషాలు రెచ్చగొట్టేల పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు కొత్త అస్త్రాన్ని నగర పోలీసులు రూపొందించారు. గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. ‘సాక్ ఐ’ ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి.
AI Social Media Surveillance | అద్భుత విజయం
సాక్ ఐ ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్లను గుర్తించింది. దీంతో పోలీసులు ఆ కంటెంట్ను తొలగించారు. అంతేగాకుండా విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించి చర్యలు చేపట్టారు.
AI Social Media Surveillance | వారికి చుక్కలే..
మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది. వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను గుర్తిస్తుంది. దీంతో పోలీసులు వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది. ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
దీనిని కూడా చదవండి : KBR Park | కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లు నరకొద్దు.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం


