అక్షరటుడే, వెబ్డెస్క్: Samsung Employees Strike | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ అయిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) సమస్యను ఎదుర్కొంటోంది. బోనస్ విషయంలో యాజమాన్యానికి, కార్మిక సంఘానికి మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో 47 వేలమందికిపైగా ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. ఈ సమ్మె గురువారం (మే 21) నుంచి ప్రారంభం కానుంది.
Samsung Employees Strike | కంపెనీ చరిత్రలో భారీ నిరసన..
కంపెనీ చరిత్రలోనే భారీ నిరసనగా 18 రోజుల సమ్మె నిలవనుంది. ఉద్యోగులు 18 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. 47 వేల మంది ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మె చేస్తే సంస్థకు రూ.1.6 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. నష్టం ఒక్క శాంసంగ్ సంస్థకే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల తయారీకి అవసరమైన మెమరీ చిప్ల మార్కెట్లో శాంసంగ్దే ఆధిపత్యం. సమ్మె వల్ల గ్లోబల్ మార్కెట్లో ఏఐ చిప్ల కొరత ఏర్పడి, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Samsung Employees Strike | సమస్య ఏమిటంటే?
ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి ప్రధాన కారణం ‘పనితీరు ఆధారిత బోనస’. తమ ప్రధాన ప్రత్యర్థి సంస్థ ‘ఎస్కే హైనెక్స’ తన ఉద్యోగులకు ఇస్తున్న భారీ బోనస్లతో పోలిస్తే శాంసంగ్ యాజమాన్యం తక్కువ బోనస్ ఇస్తూ అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు. కంపెనీ సాధించే నిర్వహణ లాభాల్లో 15 శాతాన్ని బోనస్ పూల్గా కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న 50 శాతం బోనస్ పరిమితిని ఎత్తివేయాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం ఒకేసారి 13 శాతం బోనస్ ఆఫర్ ఇస్తామని చెబుతోంది. శాశ్వత మార్పులకు ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులకు మధ్య నేషనల్ లేబర్ రిలేషన్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన 17 గంటల సుదీర్ఘ చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఉద్యోగులు సమ్మె చేయాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి..: Today Stock Market | కోలుకున్న మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు


