అక్షరటుడే వెబ్డెస్క్: Tirumala Devotee Rush | వేసవి సెలవుల కారణంగా తిరుమలకు(Tirumala) భక్తులు భారీగా పోటెత్తారు. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు క్యూలైన్లలోకి రావద్దని టీటీడీ అధికారులు అత్యవసర ప్రకటన విడుదల చేశారు.
Tirumala Devotee Rush | జనసంద్రంగా మారిన తిరుమల..
వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరిగింది. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తుండటంతో తిరుమల క్షేత్రం జనసంద్రంగా మారింది. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు కూడా నిండటంతో, క్యూలైన్ చివరకు బాట గంగమ్మ ఆలయం వరకు చేరుకుంది.
Tirumala Devotee Rush | క్యూలైన్లపై అధికారుల విజ్ఞప్తి
ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి (టోకెన్ లేని దర్శనం) 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ రద్దీని నియంత్రించడానికి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు టీటీడీ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. భక్తులెవరూ ఇప్పుడు క్యూలైన్లలోకి రావద్దని, శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాతే క్యూలైన్లలోకి ప్రవేశించాలని కోరారు. అధికారుల సూచనతో క్యూలైన్లలో వేచి ఉండలేని భక్తులు వెనుదిరిగి, పీఏసీ (PAC) సముదాయాలకు చేరుకుంటున్నారు.
Tirumala Devotee Rush | వసతి గదుల కోసం బారులు..
మరోవైపు తిరుమలలో వసతి కొరత తీవ్రంగా ఏర్పడింది. సీఆర్వో (CRO) కౌంటర్ల వద్ద గదుల కోసం భక్తులు సుదీర్ఘ క్యూలైన్లలో వేచి ఉన్నారు. అటు స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు కల్యాణకట్టల వద్ద కూడా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సెలవుల సీజన్ ముగిసే వరకు తిరుమలలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చవంండి: Saraswati Pushkaralu | సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం


