అక్షరటుడే, వెబ్డెస్క్: AIIMS Bariatric Surgery | ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు 209 కిలోల బరువున్న ఓ రోగికి అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ (బరువు తగ్గించే) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జూలై 24న ఈ శస్త్రచికిత్స నిర్వహించగా, ప్రస్తుతం రోగి బరువు 160 కిలోలకు తగ్గినట్లు వైద్యులు తెలిపారు.
AIIMS Bariatric Surgery | అసాధరణంగా బరువు పెరగడంతో..
వైద్యుల వివరాల ప్రకారం, రోగి సకాలంలో శస్త్రచికిత్స చేయించుకోకపోవడంతో అతని బరువు 181 కిలోల నుంచి 209 కిలోలకు పెరిగింది. అంతేకాకుండా, అతని పొట్ట చుట్టుకొలత 198 సెంటీమీటర్లకు చేరడంతో సాధారణ ఆపరేషన్ టేబుల్ కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది.
AIIMS Bariatric Surgery | ప్రత్యేక డైట్ ప్లాన్..
ఈ నేపథ్యంలో ముందుగా 32 రోజుల పాటు ప్రత్యేక లో-క్యాలరీ ఆహార ప్రణాళికను అమలు చేసి, రోగి బరువును 209 కిలోల నుంచి 172 కిలోలకు తగ్గించారు. అనంతరం బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ కేసు అత్యంత సంక్లిష్టమైనదైనా, వైద్య బృందం సమన్వయంతో విజయవంతంగా పూర్తిచేయడం విశేషమని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.